తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కొత్త మంత్రుల ఎంపికపై కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశమై కొత్త మంత్రుల ఎంపికపై కీలకంగా చర్చించనున్నారు. పార్టీలో సామాజిక సమీకరణలు, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాల ఆధారంగా మంత్రివర్గం పునర్వ్యవస్థ జరుగనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు రేవంత్ క్యాబినెట్లో 12 మంది మంత్రులే ఉన్నారు. మొత్తం కేబినెట్ సంఖ్య 18 మందికి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు పదవుల భర్తీపై ఈ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెంటనే నిర్ణయం తీసుకుంటారా లేక మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈసారి కోమటిరెడ్డి…
ఈసారి మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ కు అవకాశాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కాంగ్రెస్లో చేరినప్పుడే మంత్రి పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఆ హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రాతినిధ్యం లేని జిల్లాలు..
మరోవైపు పీసీసీ కార్యవర్గాన్ని కూడా పార్టీ హైకమాండ్ ఖరారు చేయనుంది. కేబినెట్లో ఇప్పటికే ప్రాతినిధ్యం లేని జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిని కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ అంశాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని సమతుల్యంగా పునర్వ్యవస్థ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో త్వరలోనే మంత్రుల ఖరారుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.