TSGENCO: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి పోటీ పరీక్ష వాయిదా.. ఎందుకంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పోటీ పరీక్ష వాయిదా పడింది. టీఎస్ జెన్కో నిర్వహించతలపెట్టిన పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థులు ఉపముఖ్యమంత్రి భట్టిని అభ్యర్థించడంతో పరిశీలించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని వాయిదా వేశారు.
![revanth reddy government postponed genco exams after candidates requests kms revanth reddy government postponed genco exams after candidates requests kms](https://static-ai.asianetnews.com/images/01hh582febcng855ay4h1mdf4t/untitled-design--11--png_363x203xt.jpg)
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఓ పోటీ పరీక్ష వాయిదా పడింది. అయితే.. దీనికి పేపర్ లీక్లు, లేదా కోర్టు ఆదేశాలో కారణంగా లేవు. అభ్యర్థుల విన్నపం మేరకే ఈ వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అక్టోబర్ 4వ తేదీన టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్), కెమిస్ట్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందుకుగాను వీటి పరీక్షలు ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సి ఉన్నది. అయితే, ఈ రోజునే మరికొన్ని రాత పరీక్షలు ఉన్నాయి. అందుకే జెన్కో నిర్వహించే రాత పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.
ఆర్థిక, విద్యుత్ శాఖల బాధ్యతలు తీసుకున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అభ్యర్థులు జెన్కో పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. దీంతో అభ్యర్థులకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోటీ పరీక్షలను వాయిదా వేయడానికి నిర్ణయించింది. అయితే, తదుపరి తేదీని ఇప్పుడే ప్రకటించలేదు. తదుపరి షెడ్యూల్ను జెన్కో అధికారిక వెబ్ సైట్ www.tsgenco.co.inలో అప్డేట్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.