ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు పీఎంవోకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.
నిజామాబాద్ : తెలంగాణ పర్యటన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపుతామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి మోదీపై బాంబులతో దాడి చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎంవో ప్రధాని సెక్యూరిటీతో పాటు తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసాయి. అయితే ఇది కేవలం బెదిరింపు కాల్ మాత్రమేనని... ఎలాంటి బాంబ్ దాడి చేసే అవకాశాలు లేవని తెలిసి ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే... ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందురోజు(సోమవారం) రాత్రి గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన రిటైర్డ్ సిఆర్పీఎఫ్ ఉద్యోగి సాయన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసాడు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బాంబులతో దాడిచేసి చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పిఎంవో అధికారులు తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసారు.
ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించింది సాయన్నగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా మతిస్థిమితం సరిగ్గా లేనందున న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసారు.
Read More నేను సీఎం కావడానికి మీ పర్మిషన్ ఎందుకు .. మీరు భయపెడితే భయపడం : మోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలావుంటే మంగళవారం నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను కలిసి ఎన్టీఏలో చేరడానికి ప్రయత్నించారని ప్రధాని తెలిపారు. హైదరాబాద్ మేయర్ పదవిని కూడా బిజెపికే ఇస్తామన్నారని అన్నారు. అయితే తన కొడుకు కేటీఆర్ ను ఆశీర్వదించాలని కోరారని... అందుకు ఇది రాజరికం కాదని తాను చెప్పినట్లు ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేసారు.
జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు తాను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ స్వాగతం పలికేవారని... ఆ తర్వాత సీన్ మారిపోయిందని ప్రధాని అన్నారు. తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని... కానీ ప్రజల ఆశీర్వాదం వున్నవారే పాలకులు అవుతారని ప్రధాని మోదీ అన్నారు.