గద్వాల్ జోగులాంబ ఆలయంలోని దర్గాను తొలగించండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
గద్వాల్ జిల్లాలో ఉన్న జోగులాంబ ఆలయంలో కొంత కాలం కిందట ఆకస్మాత్తుగా దర్గా, కమాన్ వెలిశాయని, వాటిని వెంటనే తొలగించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. హిందూ ఆలయంలో అక్రమంగా నిర్మించిన హిందూయేతర నిర్మాణాలను తీసివేయాలని పురావస్తు శాఖకు లేఖ రాశారు.
గద్వాల్ జిల్లా అలంపూర్లోని జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉన్న హిందూయేతర నిర్మాణాలను తొలగించాలని బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పురావస్తు శాఖ (ఏఎస్ఐ)ని కోరారు. ఈ మేరకు పురావస్తు శాఖకు ఆయన అధికారికంగా లేఖ రాశారు. ఆ లెటర్ లో ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు అంశాలను రాజాసింగ్ ప్రస్తావించారు. ఈ జోగులాంబ ఆలయం దేవికి అంకితమైన పురాతన హిందూ దేవాలయాలలో ఒకటని పేర్కొన్నారు. ఈ ఆలయం మహా శక్తి పీఠాలలో ఒకటని, పద్దెనిమిది (అష్టాదశ) దేవాలయాల సమూహంలో ముఖ్యమైనదిగా ఉందని అన్నారు. కృష్ణానదిలో సంగమించే దగ్గర తుంగభద్ర నది ఒడ్డున ఉందని తెలిపారు.
పూజగదిలో నాలుగు కోట్ల బంగారం... బైటికి తీస్తామంటూ ఎనిమిదిలక్షలకు బురిడీ.. నకిలీ బాబాల లీలలు..
నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఉన్న ఈ ఆలయం ఏడు, ఎనిమిది శతాబ్దాల కాలంలో నిర్మించారని చెప్పారు. 2019 సంవత్సరంలో ఈ దేవాలయం భారత ప్రభుత్వం పథకం అయిన ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్) కింద చేర్చారని గుర్తు చేశారు. దీనిని భారత పురావస్తు శాఖ, హైదరాబాద్ సర్కిల్ నిర్వహిస్తోందని చెప్పారు.
ఇది మహాశక్తి పీఠం కాబట్టి భారతదేశంలోని చాలా ప్రాంతాల్లోని హిందువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. అయితే చాలా కాలం కిందట ఈ ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా ఒక దర్గా కనిపించిందని, రాత్రికి రాత్రి కమాన్ (ఆర్చ్) నిర్మాణం అయ్యిందని పేర్కొన్నారు. అయినా హిందూ దేవాలయాల్లో ఉన్న ఈ అక్రమ కట్టడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, లౌకిక భారతదేశంలో హిందువులకు గౌరవ సూచకంగా పురాతన జోగులాంబ శక్తి పీఠం ప్రాంగణంలో హిందూయేతర మతపరమైన నిర్మాణాలను తొలగించాలని కోరారు.
చంఢీగడ్లో రైతులు, గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేసీఆర్ (ఫోటోలు)
దేశవ్యాప్తంగా ప్రస్తుతం హిందూ, ముస్లింల మతపరమైన ప్రార్థనాలయపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వారణాసిలోకాశీవిశ్వనాథ ఆలయాన్ని అంటుకునే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే చేపట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందులో కోర్టు ఆదేశాల ప్రకారం వీడియో గ్రాఫిక్ సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో శివలింగం ఉన్నట్టు సర్వే అధికారులు చెప్పడం చర్చకు దారి తీసింది. అయితే ఇది శివలింగం కాదని ఫౌంటెన్ అని కొందరు వాదిస్తున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
ఈ జ్ఞానవాపి మసీదు విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనూ తవ్వకాలు జరపాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుతుబ్ మినార్ను హిందూ పాలకుడు రాజా విక్రమాదిత్య నిర్మించాడని గత కొంత కాలం నుంచి వాదలు వినిపిస్తున్నాయి. ఆ ఆలయస సమీపంలో హిందూ దైవం, ఇతర విగ్రహాలు బయటపడ్డాయని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ పరిసరాల్లో ఐకానగ్రఫీ చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక ఏఎస్ఐకు ఆదేశాలు ఇచ్చింది.