హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ప్రారంభమైన లులూ హైపర్మార్ట్కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఐకియా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అనుభవాలను దృష్టిలో వుంచుకుని లులూ మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఈ స్థాయిలో వుండేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ప్రారంభమైన లులూ హైపర్మార్ట్కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. శని, ఆదివారాలే అనుకుంటే సాధారణ రోజుల్లోనూ ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ మాల్కు వచ్చే వారి కారణంగా జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మాల్ లోపల ఇసుకేస్తే రాలనంత మంది జనం వుంటున్నారు.
ఇప్పటికే మాల్లోని స్టాల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. దీనికి కారణం ఏంటన్నది మాత్రం అంతుబట్టడం లేదు. హైదరాబాద్లో పసిపిల్లలు, యుక్త వయసులో వున్న పిల్లలతో నివసిస్తున్న యువ జంటలు గణనీయంగా వున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పటికే చాలా ప్రదేశాలను సందర్శించినప్పటికీ.. నగరంలో కొత్తగా ఏమైనా వున్నాయా అని నిరంతరం వెతుకుతూనే వుంటారు.
ప్రఖ్యాత అంతర్జాతీయ ఫర్నిచర్ బ్రాండ్.. ఐకియా నగరంలో ఓ స్టోర్ను ప్రారంభించిందని తెలుసుకున్నప్పుడు జనాలు విపరీతంగా పోటెత్తారు. గచ్చిబౌలి వైపు వెళ్లే అన్ని రహదారులు వీకెండ్తో పాటు సాధారణ రోజుల్లోనూ కిటకిటలాడేవి. అలాగే దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన లులూ షాపింగ్ మాల్.. హైదరాబాద్కు వచ్చినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది.
వీకెండ్కు తోడు సోమవారం గాంధీ జయంతి కూడా కలిసి రావడంతో కూకట్పల్లిలోని లులూ మాల్కు వెళ్లే రహదారులపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. ఏది ఏమైనప్పటికీ సగటు పౌరుడు వారి కుటుంబాలకు సంతోషకరమైన క్షణాలను అందించేందుకు దృష్టి సారిస్తారు. ఐకియా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అనుభవాలను దృష్టిలో వుంచుకుని లులూ మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ముందే చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పేవని నిపుణులు చెబుతున్నారు.
