Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ తాజా టార్గెట్ హరీష్ ఫ్యామిలీ

  • నిన్నమొన్న కేటిఆర్ సతీమణి, మామ మీద తీవ్ర విమర్శలు
  • నేడు హరీష్ రావు సతీమణి, కూతురు పైనా ఆరోపణలు
  • డిజిపి మహేందర్ రెడ్డి పైనా సీరియస్ కామెంట్స్
Ravanth levels serious charges against Harish Rao Family

తెలంగాణ సిఎం మేనల్లుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబం మీద కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నిన్నమొన్నటి వరకు మంత్రి కేటిఆర్ ఫ్యామిలీ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా తన టార్గెట్ హరీష్ కుటుంబం మీదకు మళ్లించారు. కేటిఆర్ మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు చేశారు. కేటిఆర్ సతీమణి ఏ కులమో చెప్పాలంటూ నిలదీశారు. అంతేకాకుండా గతంలో కేటిఆర్ తనయుడు హిమాన్ష్ ను చిట్టినాయుడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు హరీష్ కుటుంబసభ్యుల మీద కూడా అదే రీతిలో మాటల దాడి ప్రారంభించారు రేవంత్.

గాంధీభవన్ లో మీడియాతో జరిపిన చిట్ చాట్ లో సంచలన విషయాలను వెల్లడించారు రేవంత్. అంతేకాదు ఈ ఆరోపణల తాలూకు ఆధారాలను త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు. తాజాగా చేసిన ఈ వివాదంలో హరీష్ సతీమణి పైనా, హరీష్ రావు కూతురుపైనా కామెంట్స్ చేశారు. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర రెండో డిజిపి మహేందర్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. ఇంతకూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటో కింద చదవండి.

గతంలో పాస్ పోర్ట్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని, హరీష్ కుటుంబాన్ని పక్కన పెట్టి సోయం బాబూరావు , కాశీపేట లింగయ్య లపై కేసులు పెట్టారని రేవంత్ వెల్లడించారు.  హరీష్ భార్య , కూతురు పేర్ల మీద దొంగపాస్ పోర్ట్ లతో గుజరాత్ మహిళలను అమెరికా పంపినట్లు ఆరోపించారు. ఆ పాస్ పోర్ట్ కేసులో అసలు దోషులను తప్పించినందుకే బహుమతిగా మహేందర్ రెడ్డి కి తెలంగాణ రెండో డీజీపీ పదవి దక్కిందన్నారు.

అధికారం కోసం కేసీఆర్ ఎస్టీ కులాలు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు.  అందులో భాగమే లంబాడా ఆదివాసీల గొడవను రగిలించారని తెలిపారు. లంబాడాల ఆదివాసీ ల గొడవలో కాంగ్రెస్ పార్టీ అసలైన ఎస్టీ లవైపు నిలబడుతుందన్న రేవంత్.. కేటీఆర్ మామ లాంటి నకిలీ ఎస్టీ లవైపు మాత్రం కాదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

తెలంగాణలో బిజెపి లక్ష్మణ్ , కిషన్ రెడ్డి ల మాటల కంటే అసదుద్దీన్ ఒవైసీ మాటకే మోడీ ఎక్కువ విలువ ఇస్తాడని ఎద్దేవా చేశారు. కేంద్ర బీజేపీ నేతలు పదే పదే కేసీఆర్ సర్కార్ చేస్తున్న తప్పులను వదిలేసి పొగుడుతుంటే తెలంగాణ లో బీజేపీ పార్టీ అవసరమా అని మరోసారి నిలదీశారు. కేసీఆర్ ను ఓడించాలనుకునే ప్రజలు కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ చేస్తున్న కాంగ్రెస్ వైపు నిలబడాలన్నారు.

మిషన్ భగీరథ కు కేటాయించిన యాభై వేల కోట్లల్లో కేవలం ఇరవై వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కు తీసుకొచ్చిన గోదావరి పైపు లైన్ నుంచి గజ్వెల్ , సిద్ధిపేట లకు భగీరథ కింద నీళ్లు ఇచ్చామని చెబుతున్నారని విమర్శించారు. అలా చేయడం వల్ల హైద్రాబాద్ ప్రజలపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. మెట్రొ వాటర్ వర్క్స్ కింద్ హైదరాబాద్ కు వచ్చే నీళ్ల నుంచి .. భగీరథ కింద నీళ్లు ఫ్రీగా ఇవ్వడం తో హైద్రాబాద్ ప్రజలపై భారం పడుతోందన్నారు.  సాగునీటి ప్రాజెక్ట్స్ కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ ల నుంచి ఎందుకు తాగునీరు ఇవ్వడం లేదు ప్రత్యేకంగా భగీరత కిందవైపు లైన్లు ఎందుకు అని ప్రశ్నించారు. 

ప్రపంచ తెలుగు మహాసభల గురించి మాట్లాడుతూ.. సినిమా వాళ్ళు పేమెంట్ ఆర్టిస్ట్ లు .. ఏ పర్పస్ లో డబ్బులు తీసుకుంటారో వారి గురించి పొగుడుతారని తెలిపారు.  తెలుగు సభలకు సినిమా నటులు వచ్చి సహజ నటుడు కేసీఆర్ ను పొగిడారని ఎద్దేవా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios