రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం
లక్కీ డ్రాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన జంగారెడ్డి అనే రైతును అదృష్టం వరించింది.
![Ranga Reddy District Farmer Janga Reddy Wins 1KG gold in Hyderabad lns Ranga Reddy District Farmer Janga Reddy Wins 1KG gold in Hyderabad lns](https://static-ai.asianetnews.com/images/01hmx783cdp42rwekq68rawc5b/gold17-1706082700685_363x203xt.jpg)
హైదరాబాద్: లక్కీ డ్రాలో జంగారెడ్డి అనే రైతు కిలో బంగారాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఆ రైతు కుటుంబం ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తుంది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాను గ్రామానికి చెందిన జంగారెడ్డి అనే రైతు 2023లో దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో బంగారం కొనుగోలు చేశారు. అయితే ఆ సమయంలో ఫెస్టివల్ కూపన్ ను దుకాణ సిబ్బంది ఆయనకు అందించారు. ఈ కూపన్ ను నింపి ఆయన దుకాణ సిబ్బందికి అందించారు. ఫెస్టివల్ ఆఫర్ ముగియడంతో నగల దుకాణ యాజమాన్యం లక్కీ డ్రా తీసింది
. ఈ డ్రాలో జంగారెడ్డికి కిలో బంగారం దక్కింది. ఈ విషయాన్ని నగల దుకాణ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన నగల దుకాణ యాజమాన్యం రైతు జంగారెడ్డికి కిలో బంగారాన్ని బహుమానంగా అందించారు. లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకోవడంపై జంగారెడ్డి అనే రైతు ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్మిదేవి తమ ఇంటికి వచ్చిందని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
also read:ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో పరుగులు (వీడియో)
కేరళ రాష్ట్రంలో లాటరీలకు అనుమతి ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో లాటరీలో లక్షల రూపాయాలను గెలుచుకున్నట్టు మీడియాలో కథనాలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో లాటరీలను ప్రభుత్వాలు నిషేధించాయి. దుబాయి లాంటి దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కేరళ వాసులకు అక్కడి లాటరీల్లో లక్షలాది రూపాయాలను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుదు అని చెబుతున్నారు.