రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ రామ్మోహన్రావు కన్నుమూత.. మంత్రి హరీశ్ రావు సంతాపం
రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్: ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్రావు (87) కన్నుమూశారు. రామోజీ గ్రూపు సంస్థల్లో ఎండీ చేసిన ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు.
రేపు ఉదయం పది గంటలకు జూబ్లిహిల్స్లోని మహాప్రస్థానంలో అట్లూరి రామ్మోహన్రావుకు అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మోహన్రావు ఈనాడు దినపత్రికకు ఎండీగా పని చేశారు.
రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీగా వ్యవహరించిన అట్లూరి రామ్మోహన్రావు మృతిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి ఈనాడు వంటి సంస్థలో డైరెక్టర్గా, ఆర్ఎఫ్సీకి ఎండీగా ఆయన విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో రామ్మోహన్రావు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: రామోజీరావు మనవరాలి వివాహ వేడుకలో అతిరథ మహారథులు... (Photos)
అట్లూరి రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీరావుతో కలిసి ఈయన విద్య అభ్యసించారు. అప్పటి నుంచే రామ్మోహన్ రావుకు రామోజీరావుతో సాన్నిహిత్యం ఉన్నది. అయితే, రామోజీ రావు వ్యాపారంలోకి వెళ్లగా.. రామ్మోహన్ రావు ఉపాధ్యాయుడిగా మారారు.