రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభం.. ఇక నుంచి రూ.10 లక్షల ఆరోగ్య బీమా..
rajiv aarogyasri : రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ,5 లక్షల బీమా అందుతోంది. కొత్త ప్రభుత్వం దానిని రూ.10 లక్షలకు పెంచింది.
![Rajiv Arogya Shree scheme launched.. Rs 10 lakh health insurance from now on..ISR Rajiv Arogya Shree scheme launched.. Rs 10 lakh health insurance from now on..ISR](https://static-ai.asianetnews.com/images/01hh6ygnjg93b3s5rkhgwj1a6x/rajeev-arogya-sri-jpg_363x203xt.jpg)
rajiv aarogyasri : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెడుతోంది. రెండు రోజుల కిందట జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలపై చర్చించింది. వాటి అమలకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు అయ్యాయి. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, తన మంత్రులు, సీఎస్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు.
తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. కొత్త ఐటీ మినిస్టర్ ఆయనే..
తాజాగా తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కూడా ఆయన ప్రారంభించారు. దీనిని సంబంధించిన లోగోను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీలు, ఇతర మంత్రులు అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పథకం వల్ల తెలంగాణలో బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందనుంది.
ఇప్పటి వరకు తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం కింద 5 లక్షల వరకు బీమా ఉండేది. తాజాగా ఇది రూ.10 లక్షలకు పెరిగింది. తెలంగాణలోని 90.10 లక్షల కుటుంబాలకు ఈ పథకానికి అర్హత ఉందని వర్గాలు వెల్లడించాయి. ఈ పథకంలో 21 స్పెషాలిటీల కింద వివిధ వ్యాధులను కవర్ చేయడానికి 1672 ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.