ప్రియుడి కోసం భర్తను చంపిన స్వాతి: ఇంకా జైలులోనే రాజేష్
ప్రియురాలి కోసం ఆమె భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నా రాజేష్ ఇంకా జైలులోనే మగ్గుతున్నాడు. రాజేష్ ప్రియురాలు స్వాతి రెండు రోజుల క్రితం బెయిల్ వచ్చింది
నాగర్కర్నూల్లో 2017 నవంబర్ మాసంలో భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ హత్య చేశారు. ప్రియుడి మోజులో పడిన స్వాతి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. క్రషర్ వ్యాపారంలో బిజీగా ఉన్న సుధాకర్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదని స్వాతి భర్తకు దూరమై ప్రియుడు రాజేష్కు దగ్గరైంది.
భర్తను హత్య చేస్తే ఆ స్థానంలో ప్రియుడు రాజేష్ ను తీసుకురావాలని స్వాతి ప్లాన్ చేసింది. ఈ మేరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి ప్రియుడిని భర్త స్థానంలోకి తీసుకొచ్చుకోవాలని ఆమె ప్లాన్ చేసింది.
అయితే ఈ పథకంలో భాగంగా గత ఏడాది నవంబర్ మాసంలో రాత్రి పూట ఇంట్లో నిద్రిస్తున్న సుధాకర్ రెడ్డిపై రాజేష్ రాడ్తో దాడి చేశాడు. అయితే ఆ సమయంలో సుధాకర్ రెడ్డి మెలకువ వచ్చింది.ఆ సమయంలో రాజేష్ పారిపోయాడు.
అయితే తమ ప్లాన్ ఫెయిలైందని భావించిన వారిద్దరూ మరో ప్లాన్ వేశారు. సుధాకర్ రెడ్డికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ సమయంలో రాజేష్ రాడ్తో తలపై కొట్టాడు. మరోవైపు దిండుతో స్వాతి సుధాకర్ రెడ్డిని ముఖంపై అదిమిపట్టింది. అంతేకాదు భర్త చనిపోయాడో లేదో అనే అనుమానంతో రాడ్తో కొట్టిందని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
ఎట్టకేలకు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. సుధాకర్ రెడ్డిని చంపిన విషయం వెలుగు చూడగానే స్వాతి చనిపోయిందని ఆమె తండ్రి ప్రకటించారు. దీంతో జైలులో ఉన్న సమయంలో ఆమె తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవరూ కూడ జైలుకు రాలేదు.
జైలు న్యాయవాదే స్వాతి తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జమానత్ కట్టేందుకు ఎట్టకేలకు ఇద్దరు ముందుకు రావడంతో జూలై 27వ తేదీన ఆమె జైలు నుండి బయటకు వచ్చింది. అయితే ఆమెను తీసుకెళ్లేందుకు ఎవరూ కూడ రాలేదు. దీంతో ఆమెను మహిళా సదనానికి తరలించారు.
ఇదిలా ఉంటే స్వాతి వ్యామోహంలో పడిన రాజేష్ ఈ కేసులో ఇంకా జైలులోనే గడుపుతున్నాడు. సినిమాలో మాదిరిగానే ప్లాస్టిక్ సర్జరీ పూర్తైతే సుధాకర్ రెడ్డి స్థానంలో తాను ప్రవేశించే అవకాశం ఉందని రాజేష్ భావించాడు. రాజేష్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి కుటుంబసభ్యులను పట్టుబట్టింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించేందుకు ఆమె తండ్రి అంగీకరించాడు. అవసరమైన డబ్బులను కూడ సమకూర్చాడు. ఈ సమయంలోనే వీరి తతంగం బయటపడింది.
ప్లాస్టిక్ సర్జరీ కోసం తన ముఖాన్ని గ్యాస్స్టవ్పై పెట్టుకొని కాల్చుకోవడంతో పాటు, పెట్రోల్ పోసుకొని కాల్చుకొన్న రాజేష్ ను యశోదా ఆసుపత్రిలో చికిత్స పూర్తైన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆసుపత్రి నుండి నేరుగా జైలుకు వెళ్లిన రాజేష్ జైలులోనే ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే జైలు నుండి బెయిల్ పై విడుదలైన స్వాతి మాత్రం బయటకు వచ్చింది. పిల్లల గురించి ఆమె తాపత్రయపడుతోంది. కానీ, స్వాతి తల్లిదండ్రులే పిల్లలను పెంచుతున్నారు. రాజేష్కు మాత్రం ఈ కేసులో ఇంకా బెయిల్ రాలేదు. సుధాకర్ రెడ్డి హత్య విషయం వెలుగు చూడకముందు కొడుకు కోసం రాజేష్ తల్లి తల్లడిల్లిపోయింది.
తన కొడుకు ఆచూకీ లభించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రాజేష్ తో స్వాతి వివాహేతర సంబంధం వెలుగుచూడడం.... వీరిద్దరూ అరెస్ట్ కావడం వంటి పరిణామాలతో రాజేష్ తల్లి షాకయ్యింది.
ఈ వార్తలు చదవండి
1.స్టేట్హోమ్కు భర్తను చంపిన నాగర్కర్నూల్ స్వాతి
2.ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...