తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి...రాగల రెండు రోజులు వర్షాలే
చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్: చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక రానున్న రెండు రోజు (శని, ఆదివారా)ల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. అయితే భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలో గత రెండురోజులుగా ముసురు పట్టుకుంది. రాజధాని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఆనందంగా వున్నారు. ఈ వర్షాలకు భూగర్భజలాల పరిస్థితి కూడా కాస్త మెరుగయ్యిందని తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్ర ప్రకటన వారి ఆనందాన్ని మరింత పెంచింది.