ఇక్కడ గోతులు తవ్వుట మరిచారు
చట్టం ప్రకారం తవ్వాల్సిన రెయిన్ హార్వెస్టింగ్ గోతులను తెలంగాణా ముఖ్యమంత్రి క్యాంపాఫీసులో తవ్వడం మరిచారు
పెద్ద అర్కిటెక్ట్ ప్లానేశారు.
పెద్ద పెద్ద ఇంజనీర్లు స్టడీ చేశారు.
అంతే పెద్ద కాంట్రాక్టర్ ఎవరో కట్టారు
సీనియర్ ఆఫీసర్లు పర్యవేక్షించారు
ముఖ్యమంత్రి స్వయంగా రోజూ సమీక్షించారు.
వాస్తు సరిగ్గా వుందో లేదో చాలా జాగ్రత్త తీసుకున్నారు.
అత్యాధునిక వసతులు అమరాయో లేదో చెక్ చేసుకున్నారు.
ఇరవైనాలగ్గంటలు కంటికి రెప్పలా కాపాడేందుకు 50 మంది సాయుధ పోలీసులను నియమించారు. లోన అడిటోరియం, బయట పార్కింగ్ వసతి చక్కగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.
రాజభవనం రు. 50 కోట్ల ఖర్చుతో సంతృప్తిగా సకాలంలో పూర్తయింది.
గృహప్రవేశ పండగ అట్ట హాసంగా జరిగింది.
ఇపుడు బయటపడింది: అంతా బాగుంది , గోతులు తవ్వడమే మరిచారు అని.
చట్టం ప్రకారం ఒక కొత్త ఇల్లు కట్టేటపుడు తవ్వాల్సిన రెయిన్ హార్వెస్టింగ్ గోతులను తెలంగాణా ముఖ్యమంత్రి క్యాంపాఫీసులో తవ్వడం మరిచారు అధికారులు, ఇంజనీర్లు.
అందువల్ల ఇపుడు మరొక ఎనిమిది లక్షలు ఖర్చు చేసి గోతులు తవ్వడం మొదలుపెడుతున్నారు.
ఈ డబ్బుతో 20 వర్షం నీళ్ల ఇంకుడు గుంతలు తవ్వుతారు.
బిల్లు ఎవరు చెల్లించాలనే తేలగానే, గోతులు తవ్వడం మొదలుపెడతారట.
ఇంకుడు గుంతలు తవ్వడం తప్పనిసరి అయినా ఇంత పెద్ద బంగళా కట్టేటపుడు మరచిపోవడమనేది పాయింట్.
ఇపుడు ఈ గోతులు తవ్వేందుకు ఒక ఉన్నతాధికారుల బృందం ఒకటి ముఖ్యమంత్రి క్యాంపాఫీసు ఉన్న 9 ఎకరాలస్థలంలో నేల స్వభావం పరీక్షించారు. దాని ప్రకారం గుంతలెక్కడ తవ్వాలనే విషయాన్ని నిర్ధారిస్తారని మీడియా కథనం.
ఇప్పటికయితే 20 గుంతలు తవ్వాలనేది ఖరారయింది.