రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ వాసులను వర్షాలు మరోసారి పలకరించనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సంభవించనున్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే..
జూన్ 6న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. వర్షాల సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
ఇక ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, భూపాలపల్లి, ఖమ్మం, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చిరు గాలులతో వర్షం మొదలైంది.
ఈశాన్య దిశకు…
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో గండిమైసమ్మ, గాజులరామారం, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు లోనయ్యారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ఈసారి వర్షాలు సాధారణ కాలానికి ముందే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ రుతుపవనాలు ఈశాన్య దిశకు కదులుతున్నాయి. ఈ కారణంగా వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. గత రెండు రోజులుగా ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ ప్రకారం వచ్చే రోజులలో మళ్లీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తున్నాయి.