బీజేపీ స్కెచ్ అదుర్స్.. తెలంగాణలోనే ప్రధాని మోడీ మకాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇంతకీ ప్రధాని షెడ్యూల్ ఎంటీ? ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారంటే..
![Prime Minister Narendra Modi will visit the state of Telangana for three days KRJ Prime Minister Narendra Modi will visit the state of Telangana for three days KRJ](https://static-ai.asianetnews.com/images/01hftyxgwf7gsqvz6t1st6adaj/capture_363x203xt.jpg)
Narendra Modi: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం ఇంకో 5 రోజుల్లో ముగియనున్నది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ మరింత దూకుడు పెంచింది.
ప్రధాని మోడీతో సహా పలువురు బీజేపీ జాతీయ నేతలను(BJP) ప్రచార పర్వంలో దించాలని భావిస్తోంది. తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోడీ .. ఏకంగా మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోడీ 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొనున్నారు. తొలి రోజు అంటే..ఈ నెల 25 వ తేదీన సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
మొదటి రోజు షెడ్యూల్ (నవంబర్ 25)
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్న ప్రధాని మోడీ ఈ నెల 25న మధ్యాహ్నం 1:25 గంటల పాంత్రంలో దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగంలో మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు పాల్గొని అందులో ప్రసంగించనున్నారు.
ఆ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లాకు బయలుదెరనున్నారు. సాయంత్రం 4:05 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4:15 గంటల నుంచి 4:55 గంటల వరకు పాల్గొంటారు. ఈ సభ అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాజ్ భవన్కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.
రెండవ రోజు షెడ్యూల్ (నవంబర్ 26)
ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా..తొలుత ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కన్హయ్య శాంతివనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి నేరుగా దుబ్బాక నియోజకవర్గానికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సభలో దాదాపు అర గంట ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం నిర్మల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సభలో మధ్యాహ్నం 3:45 గంటల నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు పాల్గొనున్నారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో తిరుపతికి బయలుదేరనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.
మూడవ రోజు షెడ్యూల్ (నవంబర్ 27)
మూడవ రోజు .. (27న) ఉదయం 11:30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1:25 గంటల వరకు పాల్గొంటారు. ఈ సభ అనంతరం కరీంనగర్ వెళ్లనున్నారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 2:45 గంటల నుంచి 3:25 గంటల వరకు పాల్గొనున్నారు. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకొనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాల్గొంటారు.ఈ రోడ్ షో అనంతరం నేరుగా పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6:25 గంటల ప్రాంతంలో ఢిల్లీకి తిరిగి బయలు దేరనున్నారు.