హైద్రాబాద్  నగరంలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో  మంగళవారంనాడు రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము పర్యటించారు.  కాలేజీ విద్యార్ధులు, ఫ్యాకల్టీతో  ముఖాముఖి నిర్వహించారు.

హైదరాబాద్: పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.హైద్రాబాద్ నగరంలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో విద్యార్ధులతో రాష్ట్రపతి మంగళవారంనాడు ముఖాముఖి నిర్వహించారు. విద్యార్ధులు పలు అంశాలపై రాష్ట్రపతితో ముచ్చటించారు. విద్యార్ధులు లేవనెత్తిన అంశాలపై రాష్ట్రపతి స్పందించారు.మన విద్యా విధానంలో క్రమశిక్షణ ఉంటుందన్నారు. అనారోగ్యకర పోటీలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. పక్కవారిని పోల్చుకొని జీవిస్తే ఒత్తిడి పెరుగుతుందని ఆమె చెప్పారు.తెలంగాణ పోరాట యోధులను ఎప్పటికీ మరువలేమని రాష్ట్రపతి చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పెరుగుతున్న యువ జనాభా భారత్ కు మరింత సానుకూలమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి అనేది చాలా ముఖ్యమన్నారు. మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ముర్ము విద్యార్ధులకు సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా స్వంత సంస్కృతిని చూసి గర్వపడాలని ఆమె సూచించారు. గ్రామం, గిరిజన ప్రాంతం నుండి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయవద్దని రాష్ట్రపతి కోరారు.మన దేశంలో ప్రతి ఊరికి గ్రామ దేవత రక్షణగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మహిళలు అన్ని రంాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని రాష్ట్రపతి చెప్పారు. మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని ఆమె గుర్తు చేశారు. తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు విలువల గురించి నేర్పాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని రాష్ట్రపతి కోరారు.భారత్ లో ఉన్న జనాభా అమెరికాలో లేదని రాష్ట్రపతి ప్రస్తావించారు. భారత్ లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిద్యం అమెరికాలో లేవని ఆమె చెప్పారు.

అంతకుముందు కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలకించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.