ఆమ్రపాలి కాదు.. ప్రీతి మీనా
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని పరిణామం
- ఆమ్రపాలి అనుకుంటే సీన్ మారిపోయింది
- ప్రీతిమీనా సీన్ లోకి వచ్చారు
ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముక్కచెక్కలైంది. వరంగల్ అర్బన్ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాగా, మహబూబాబాద్ జిల్లాగా, జనగామ జిల్లాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలుగా మారిపోయింది. దీంతో అన్న జిల్లలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. పాలనలో దుమ్ము రేపుతున్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక పరిణామం ఆసక్తికరంగా మారింది. మరి ఆ ముచ్చటేందబ్బా అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం చదవండి.
ఇటీవల తెలంగాణ లో జరిగిన లంబాడా, ఆదివాసీల వివాదంలో పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. కొందరిపై వేటు పడింది. మరికొందరు సమర్థులు అనుకున్నవారిని సెన్సిటీవ్ జిల్లాలకు బదిలీ చేశారు. ఆ సందర్భంలో వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ స్థానంలో బాధ్యతలను పక్కనే ఉన్న అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి ఆదేశాలు అందాయి. కానీ.. ఇక్కడే మెలిక పడింది. మ్యాటర్ పెండింగ్ లో పడింది.
అసలు ముచ్చటేందంటే ఆమ్రపాలి ఈనెల 21వ తేదీ వరకు ఆమ్రపాలి సెలవులో ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ ఆమె 21వ తేదీ వరకు లీవ్ లో ఉండడంతో ఆ బాధ్యతలను తుదకు పక్కనే ఉన్న మరో జిల్లా అయిన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాకు అప్పగించారు. ప్రీతిమీనా, ఆమ్రపాలి ఇద్దరూ మంచి స్నేహితులు. వారిద్దరూ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. నవతరం కలెక్టర్లుగా వ్యవరించారు. ఇద్దరూ కలిసే ఫారెస్టులో గతంలో హల్ చల్ చేశారు.
గతంలో ప్రీతిమీనాకు స్థానిక మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో వివాదం ఉంది. శంకర్ నాయక్ ప్రీతిమీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ గతంలో పెద్ద దుమారమే రేగింది. అఖిలభారత సర్వీసు అధికారులంతా ప్రీతిమీనాకు మద్దతుగా నిలిచారు. ప్రజల నుంచి కూడా శంకర్ నాయక్ పట్ల ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో జోక్యం చేసుకున్న తర్వాత ఈ వివాదం సద్దుమణిగిన విషయం తెలిసిందే.