తెలుగు రాష్ట్రాల్లో మరోమారు ఎన్ఐఏ సోదాలు.. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయం సీజ్..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం తెల్లవారుజాము నుంచి పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పీఎఫ్ఐ) సంబంధించిన ప్రాంగణాలపై దాడులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం తెల్లవారుజాము నుంచి పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పీఎఫ్ఐ) సంబంధించిన ప్రాంగణాలపై దాడులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తర ప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా పది రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్ర పోలీసులు సమన్వయంతో ఈ దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. నిజామాబాద్, నెల్లూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని హైదరాబాద్లో ప్రశ్నిస్తుంది. అయితే నేడు మరోమారు ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, యువకులను ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది.
Also Read: పది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ..
హైదరాబాద్లో నేడు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోదాల అనంతరం పీఎఫ్ఐ కార్యాలయాన్ని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. గేట్కు నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పీఎఫ్ఐ ప్రతినిధులుకు ఎన్ఐఏ స్పష్టం చేసింది. వనస్థలిపురంలోని ఆటో నగర్లోని ఓ ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం.
తెలంగాణలో హైదరాబాద్తో పాటు కరీంనగర్లోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ విషయానికి వస్తే.. కర్నూలు, గుంటూరులలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది.