జనసమీకరణలో పోటీపడుతన్న టిఆర్ ఎస్, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలతో జనంలోకి వెళుతున్న ప్రతిపక్షాలు తెలంగాణా పండగలతో సంబురాలతో ప్రజాసమీకరణకు పూనుకున్న టిఆర్ఎస్
గత రెండేళ్లలో తెలంగాణా వేడుకల తెలంగాణా అయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి తెలంగాణా భావన పదికాలాల పాటు కొనసాగేందుకు , ప్రజలు తమ తెలంగాణాను చూసి గర్వపడేలా చేసేందుకు ఈ రెండేళ్లో ఎన్ని ఉత్సవాలు, సంబురాలు జరిగాయో. ప్రతి సందర్భం ప్రత్యేక తెలంగాణా సందర్భమయింది.
జాతీయ పండుగుల ఆశయమే అది. అపుడే ఒక జాతి పురుడు పోసుకుంటుందని బెనెడిక్ట్ యాండర్సన్ వంటి పరిశోధకులు ప్రపంచ జాతీయ ఉద్యమాలన్నీ పరీక్షించి చెప్పింది తెలంగాణాలో జరుగుతున్నదనిపిస్తుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా తెలంగాణా ఉత్సవాలను రూపొందిస్తూ ఉంది. ప్రజలంతా పెద్ద ఎత్తున ప్రతి ఉత్సవంలో పాల్గొనడం మొదలయింది.
ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు రైతు సమస్యలనో, చేనేత సమస్యలనో ప్రజలను ఉద్యమాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంటే, అదే ప్రజలను సమస్యల నుంచి సంబురాల వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నది. రైతుల పాదయాత్రతో సిపిఎం , కాంగ్రెస్ వేల మందిని సమీకరిస్తే, తెలంగాణా జాగృతి నాయకురాలు కవిత బతుకమ్మతో పది రోజలు పాటు తెలంగాణాని రంగు రంగుల పూల వేదికగా మార్చేశారు. అటువైపు మగవాళ్లుంటే ఇటువైపు మహిళలున్నారు.
తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో తెలంగాణా మహిలళంతా కొత్త దుస్తులు ధరించి, బతుకుమ్మను మోస్తూ నదుల వైపు , చెరువుల వైపు తెలంగాణా భావనలో లీనమై సాగిపోవడం జరిగింది. కొద్ది రోజుల కిందటే ఇదే స్థాయిలో బోనాల పండగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గాని, తెలంగాణా జాగృతమ్మ చేపట్టిన కలర్ ఫుల్ కార్యక్రమాలుగాని ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఉద్యమాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన సాంస్కృతిక ఉద్యమమే. తెలంగాణా లో ఇపుడు పాలిటిక్స్ కి కల్చర్ కి యద్ధం మొదలయింది. తెలంగాణా ప్రజలు అపోజిషన్ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపుతారా టిఆర్ ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న కల్చరల్ క్యాంపెయిన్లో భాగమవుతారో చూడాలి.
చెప్పొచ్చేదేమంటే, వందల కోట్లతో తెలంగాణాని మొత్తం కదలించిన గోదావరి పుష్కరాలు, ప్రభుత్వం కార్యక్రమంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణా జాతీయావేశం ఇంకా చల్ల బడకముదే కెసిఆర్ ప్రభుత్వం ఇపుడు మరొక దఫా త్సవాలకు సిధ్దమవుతూ ఉందని వార్తలు వెలువడుతున్నాయి. 2014 జూన్ రెండున తెలంగాణా లో టిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెడ్డేళ్లయిన సందర్భంగా డిసెంబర్ రెండు నుంచి రెండున్నరేళ్ల ఉత్సవాలు జరగుతాయన్నది సమాచారం. తెలంగాణా మొదటి ప్రభుత్వం విజయవంతంగా రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నందుకు మిడ్ టర్మ్ సంబురాలు చేపట్టాలని యోచిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిసింది. ఒక వారం పాటు ఈ తెలంగాణా మిడ్ టర్మ ఉత్సవాలు జరిపే విషయం గురించి తొందర్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి తెలంగాణా ఉత్సవాల పరంపర కొనసాగుతూ ఉంది. రాష్ట్రావతరణ, సమ్మక్క సారక్క, బతుకమ్మ, బోనాలు, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభాలు, భవనాల శంకుస్థాపనలు, ప్రాజక్టుల కార్యక్రమాలు,భారీ జాతీయ పతాకావిష్కరణ... అన్నీ తెలంగాణా సాంస్కతిక ఉద్యమం లా సాగుతూ ఉండటం విశేషం. ఈ ఉత్సవాలు, సంతోషం ఇలా కొనసాగేందుకు కారణం తెలంగాణాయే అనే భావం కల్పించేందుకు, దాని ద్వారా ప్రతిపక్ష పార్టీల అసమ్మతి రాజకీయాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.
