ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగాల పేరిట మహిళలను మోసం చేసిన సైబర్ నేరగాడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగాల పేరిట మహిళలను మోసం చేసిన సైబర్ నేరగాడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన నిందితుడు క్లెమెంట్ రాజ్ అలియాస్ ప్రదీప్ ఎక్కువగా నైట్ షిఫ్టులకు విధులకు హాజరయ్యేవాడు.
ఉదయం పూట... క్వికర్. కాం నుంచి మహిళలను ఎంచుకుని వారితో ఫోన్లో మాట్లాడేవాడు. ఓ యువతి పేరుతో పరిచయం చేసుకుని వారితో ఛాటింగ్, ఇంటర్వ్యూలు చేసేవాడు. ఈ క్రమంలో వారికి తెలియకుండా మహిళల నగ్నచిత్రాలను సేకరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
ఆ తర్వాత తానే స్వయంగా వీడియో కాల్స్ చేసేవాడు. అయితే ప్రదీప్ అమ్మాయి కాదని తెలిసిన తర్వాత సైతం బాధితులు ఎందుకు సంభాషణలు కొనసాగించారనేది అంతుబట్టడం లేదు.
తనతో మాట్లాడకపోతే నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని అతను బెదిరించి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ప్రదీప్ బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మియాపూర్కు చెందిన ఓ మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రదీప్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మిగిలిన వారు మాత్రం భయంతో ఇంకా వెనుకడుగు వేస్తూనే వున్నారు.
మరోవైపు ప్రదీప్ నిర్వాకం వెలుగులోకి రావడంతో అతని కుటుంబసభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని బుద్ధిగా సంసారం చేస్తునన అతనిలో ఇంతటి కీచకుడు ఉన్నాడంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇతని బాగోతాన్ని బయటకు తీయాలంటే మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కూకట్పల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
