హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో మంజుల అనే మహిళ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి  తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీలను ఈ హత్యకు కారణమని నిర్దారించారు. 

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో మంజుల అనే మహిళ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీలను ఈ హత్యకు కారణమని నిర్దారించారు. మంజులను హత్య చేసిన రిజ్వానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈరోజు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వడ్ల మంజులకు, షేక్ రిజ్వానాకు మధ్య పరిచయం ఉంది. రిజ్వానా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంతకాలం క్రితం రిజ్వానాకు మంజుల డబ్బు ఇచ్చింది. అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మంజులకు, రిజ్వానాలకు మధ్య గొడవ జరిగింది. 

అయితే కొత్త బాండ్ విషయంలో.. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీనివాస ఎన్‌క్లేవ్‌లోని రిజ్వానా ఇంటికి మంజుల వెళ్లింది. ఇద్దరు కలిసి భోజనానికి కుర్చున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. ఆ సమయంలో మంజుల కంట్లో కారం కొట్టిన రిజ్వానా.. చీర కొంగుతో ఉరి వేసింది. ఆ తర్వాత మంజుల మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టింది. అదే రోజు రాత్రి 11.20 గంటల సమయంలో బెడ్‌ షీట్‌లో మంజుల మృతదేహాన్ని చుట్టి.. ఫస్ట్‌ ఫ్లోర్ నుంచి కిందకు తీసుకుని వచ్చి రోడ్డు మీద లాక్కుని వెళ్లింది. 

ఇంటి నుంచి 60 మీటర్ల దూరంలో నిర్మానుష్య ప్లాట్‌కు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. అంతకుమందే మంజుల ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసేసుకుంది. మంజుల మృతదేహానికి నిప్పంటించిన తర్వాత కొత్తూరు ప్రాంతానికి వెళ్లింది. ఆ తర్వాత మరుసటి రోజు శ్రీనివాస ఎన్‌క్లేవ్‌లోని నివాసానికి చేరుకుంది. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం.. రిజ్వానా ఈ హత్య చేసిందని నిర్దారణకు రావడం జరిగింది. రిజ్వానాను కూడా అదుపులోకి తీసుకోగా.. ఆమె కూడా నేరాన్ని అంగీకరించింది. ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 24 గంటల్లో కేసును చేధించాం. మొత్తం సింగిల్ హ్యాండెడ్‌గా రిజ్వానానే హత్య చేసింది. ఆమెకు ఎవరూ సహకరించలేదు. తొండుపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి డీజిల్ తీసుకున్న వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధం లేదు.