ఈ నెల 19 లేదా 20న తెలంగాణకు మోడీ.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్లో సభ..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా కేంద్ర పెద్దలు, పార్టీ పెద్దలు తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19 లేదా 20న రాష్ట్రానికి రానున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20న సికింద్రాబాద్కి మోడీ వచ్చే అవకాశం వుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు . అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరే మోడీ ప్రసంగం వుండే అవకాశం వుంది.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి సమాచారం అందింది. దీంతో ఆయా మార్గాల్లో రైలు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్-విజయవాడ మధ్య జనవరి 2023లో నడపాలని నిర్ణయించారు. అయితే అధికారిక తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ రైలు గంటకు 165 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
ALso Read: వచ్చే నెలలో ఏపీలో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
సికింద్రాబాద్ నుండి కాజీపేట మీదుగా విజయవాడ వరకు 1,129 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. తర్వాత విశాఖపట్నం వరకు విస్తరిస్తారు. రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తుంది. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి నడపాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. ఈ రైలు మార్గంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వినోద ప్రయోజనాల కోసం ఆన్బోర్డ్ హాట్ స్పాట్ వై-ఫై, సౌకర్యవంతమైన సీటింగ్ లు దీని ప్రత్యేకత. వందే భారత్ ఎక్స్ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.