బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బస‌పై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. భద్రతా కారణాల  నేపథ్యంలో..  మదాపూర్‌లోని Novatel Hotelను మోదీ బస చేయనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బస‌పై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. అయితే రాజ్‌భవన్‌ నుంచి హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు సాగించడం.. భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారతాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మదాపూర్‌లోని Novatel Hotelను మోదీ బస కోసం పరిశీలించారు. చివరగా అక్కడే మోదీ బస ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కూడా అనుమతించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక, జూలై 2, 3, 4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్‌లోనే బస చేయనున్నారు. ప్రధాని మోదీ బస కోసం ఆ హోటల్‌లో ఓ ఫ్లోర్‌ మొత్తం రిజర్వు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. జూలై 2,3 తేదీల్లో హెచ్‌ఐసీసీ‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. జూలై 3వ తేదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. జూలై 4వ తేదీన హైదరాబాద్ నుంచే ప్రధాని మోదీ.. ఏపీలో భీమవరం బయలుదేరి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: తెలంగాణ వంటకాల రుచి చూడనున్న ప్రధాని.. వంటలు చేయనున్న కరీంనగర్ యాదమ్మ...

 ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు.

సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసీసీతో పాటు.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బస చేసే హోటళ్లను భద్రత బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇటీవలి నిరసనల దృష్ట్యా సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచారు. హెచ్‌ఐసీసీకి 5 కిలో మీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి జూలై 3 వరకు నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉండనున్నాయి. డ్రోన్లు, పారాగ్లైడింగ్ ఎగరడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 

అలాగే సైబరాబాద్ పరిధిలోని నోవాటెల్, హైదరాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్, రాజ్ భవన్ పరిసరాల్లో నో ఫ్లయినింగ్ జోన్‌ ప్రకటించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆంక్షలు ఉల్లంగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.