ఢిల్లీ రావాలని కోరిన మోదీ పెద్ద నోట్ల రద్దుపైనే ప్రదాన చర్చ
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు రేపు దిల్లీ వెళ్లనున్నారు. నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో ఈ రోజు కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు. దీంతో స్పందించిన ప్రధాని నోట్ల రద్దుపై చర్చించేందుకు దిల్లీ రావాలని కేసీఆర్కు సూచించినట్లు సమాచారం. ఎల్లుండి ప్రధాని మోదీతో.. కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముంది.
అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, అన్నిశాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు నోట్ల రద్దు దోహదపడితే ప్రధానికి మద్దతివ్వాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. సంస్కరణలు కొనసాగాలి, కేంద్రం నిర్ణయంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా చూడాలని సీఎం సూచించారు.
అలాగే, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే టిఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ పెద్ద నోట్ల రద్దుపై సామాన్యుల కష్టాలను సభలో ప్రస్తావించాలని సూచించారు. సభకు అంతరాయం కలగకుండా హుందాగా ఉండాలని కోరారు.
