శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెన్నాల్‌ టన్నెల్‌ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్‌ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ రెడ్డికి ప్రధాని ఈ విషయం గురించి ఫోన్‌ చేసి మాట్లాడారు..  

ఎస్ఎల్బీసీ సొరంగం 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద స్థలానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. 

కాగా ప్రమాదం గురించి తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులను అప్రమత్తం చేసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టి టన్నెల్ బోరింగ్ మిషన్‌ వెనుక ఉన్న 42 మంది బయటికి పంపినట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. టన్నెల్ లోపల 8 మంది చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. 

ప్రధాని మోదీ ఫోన్‌..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బంది రక్షణ చర్యల గురించి రేవంత్‌తో చర్చించినట్లు సమాచారం. రక్షణ చర్యలకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలుస్తోంది. 

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: