బిజెపి శ్రేణులు తనకు సహకరించడం లేదని... ఇలాగయితే పార్టీని పటిష్టం చేయడం కుదరడం లేదంటూ పెద్దపల్లి బిజెపి అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ రాజీనాామా చేశారు. 

పెద్దపల్లి: దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుత ఫలితాన్ని సాధించి మంచి ఊపుమీదున్న తెలంగాణ బిజెపికి ఆర్టిసి మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ షాకిచ్చారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్ష పదవికి ఆయన తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అదిష్టానానికి పంపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ లేఖలో తన రాజీనామాకు గల కారణాలను సోమారపు వివరించారు. బిజెపి శ్రేణులు తనకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఇలాగయితే పార్టీని పటిష్టం చేయడం కుదరడం లేదన్నారు. పార్టీ కార్యకలాపాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని... తనకు వ్యతిరేక గ్రూపులు కడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు తన మాటను లెక్కచేకపోవడంతో పార్టీకి తగిన సేవని అందించలేకపోతున్నానని... అందువల్లే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమారపు ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌ ను వీడి బిజెపిలో చేరారు. ఆ ఎన్నికల్లో గోదావరిఖని నుండి సోమారపు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్ విజయం సాధించి... ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన గౌరవం లభించడంలేదంటూ సోమారపు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే కారణంతో బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామాపై బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.