తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేడు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్లో విద్యాశాఖకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పీడీఎస్యూ నిరసన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటికే నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఇదిలా ఉంటే.. 2023-24 ఏడాదికి బడ్జెట్ రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందని హరీష్ రావు అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు. సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణతో తెలంగాణ మన్ననలు పొందిందని తెలిపారు.
Also Read: Telangana Budget 2023-24 : తెలంగాణ బడ్జెట్ లో శాఖల వారిగా నిధుల కేటాయింపు వివరాలు...
కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాస్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్దంగా తగ్గించిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టిందని ఆరోపించారు.
దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉచితాలు అని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిదానిని లాభానష్టాలతో చూసేందుకు పరిపాలన అనేది వ్యాపారం కాదని అన్నారు. సంక్షేమ పథకాలను మానవ అభివృద్ది దృక్పథంతో చూడాలని చెప్పారు.