ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. పీహెచ్డీ చేసేందుకు విద్యార్థులను సూపర్వైజర్లకు కేటాయించడంలో వైస్ ఛాన్సలర్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఓయూటీఏ) ఆరోపించింది.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. పీహెచ్డీ చేసేందుకు విద్యార్థులను సూపర్వైజర్లకు కేటాయించడంలో వైస్ ఛాన్సలర్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఓయూటీఏ) ఆరోపించింది. ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా పేర్కొంది. విద్యార్థులపై వ్యక్తిగత ద్వేషం కారణంగా వైస్ ఛాన్సలర్.. వివిధ విభాగాల్లోని ఉపాధ్యాయులకు (సూపర్వైజర్) విద్యార్థులను కేటాయించేటప్పుడు వేర్వేరు నిబంధనలు అనుసరిస్తారని విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
రికార్డుల ప్రకారం.. పొలిటికల్ సైన్స్ విభాగంలో ( వీసీ సొంత విభాగం) ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకర్గా ఉన్న నెల్లి సత్య అనే విద్యార్థిని మొదట్లో రీసెర్చ్ సూపర్వైజర్ డాక్టర్ వీ శ్రీలతకు కేటాయించారు. అనంతరం వ్యక్తిగత ద్వేషం కారణంగా వీసీ కోరిక మేరకు సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూపర్వైజర్ డాక్టర్ కె హుస్సేన్కు అతడిని బదిలీ చేశారు. అయితే అతడు పీహెచ్డీ కోర్సు ఫీజులను రూ. 2 వేల నుంచి రూ. 20 వేలకు పెంచడాన్ని నిరసిస్తున్నాడు.. ఈ క్రమంలోనే వీసీ అతడిపై ద్వేషం పెంచుకున్నాడని ఆరోపించారు.
క్యాంపస్లో తక్కువ ర్యాంక్ ఉన్న విద్యార్థులను కేటాయించడం.. ఓయూ విద్యార్థులను వేధించాలనే అడ్మినిస్ట్రేషన్ యొక్క దుర్మార్గపు ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేస్తుందని ఓయూటీఏ పేర్కొంది. ‘‘కెమిస్ట్రీ విభాగం విద్యార్థులను సూపర్వైజర్కు కేటాయించలేదని.. పీహెచ్డీ కోర్సు వర్క్ పూర్తయిన తర్వాత విద్యార్థులను సూపర్వైజర్గా కేటాయిస్తామని పేర్కొన్నారు. పీహెచ్డి ప్రవేశ పరీక్ష నిర్వహించే సమయంలో నోటిఫై చేయబడిన ఖాళీల ప్రకారం విద్యార్థులను తప్పనిసరిగా సూపర్వైజర్కు కేటాయించాలి. ఇప్పుడు పీహెచ్డీ అడ్మిషన్ల కోసం తదుపరి నోటిఫికేషన్ ఇవ్వాలని పరిపాలన యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటప్పుడు సూపర్వైజర్ తన వద్ద అందుబాటులో ఉన్న ఖాళీలను సమర్పించే స్థితిలో ఉండరు’’ అని పేర్కొంది.
ఓయూ వీసీ నియంతృత్వ వైఖరిని, అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపింది. గతంలో ఉన్న ఫీజు నిర్మాణాన్ని పునరుద్ధరించాలని.. మెరిట్, యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి సూపర్వైజర్కు విద్యార్థులను కేటాయించడం ద్వారా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అన్ని విభాగాలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని కోరింది.
