ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన మందుల వాడకం ఎక్కువయిపోయింది. దీంతో మళ్లీ పాతకాలంలో మాదిరిగా ఆర్గానిక్ పద్దతిలో పండించే పంటలను డిమాండ్ పెరిగింది. ఇందుకోసం భూమిలోని పెస్టిసైడ్స్ ను తొలగించే పద్దతిని తెలంగాణ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 

Osmania University : హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు వ్యవసాయంలో రసాయన ఎరువుల ఎఫెక్ట్ ను తొలగించే పరిష్కారాన్ని కనుగొన్నారు. పంటల కోసం ఉపయోగించే రసాయన ఎరువులను మట్టిలోంచి తొలగించే సరికొత్త ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా జరిపారు. కేవలం మూడు వారాల్లో 90 శాతం వరకు భూమిలోని పెస్టిసైడ్స్ తొలగించే మైక్రోబియల్ ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనను ప్రొఫెసర్ సందీప్త బుర్గుల నేతృత్వంలో మూడు సంవత్సరాలపాటు నిర్వహించారు.

ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు అధికంగా పురుగుమందులు వినియోగించే వ్యవసాయ భూముల నుంచి 12 రకాల సూక్ష్మజీవులను గుర్తించారు. వీటిలో ఐదు రకాలను ఎంపిక చేసి వాటివల్ల విషపూరిత రసాయనాల తొలగింపు సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రయోగాల కోసం రెడ్, బ్లాక్ మట్టిలో నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా కలిగిన పెస్టిసైడ్ స్థాయిని ఉపయోగించారు.

ఈ సూక్ష్మజీవులను సహజ వెలుతురు, గాలి పరిస్థితుల్లో ప్రయోగించగా కేవలం మూడు వారాల్లో మట్టిలోని పెస్టిసైడ్ మిగులు 75 నుండి 90 శాతం వరకూ తగ్గినట్లు ఫలితాలు చూపించాయి. ప్రత్యేకంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ సూక్ష్మజీవులు ప్రతి 40 నిమిషాలకు రెట్టింపు సంఖ్యలో విస్తరిస్తుండటం ఈ విజయం వెనక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ పరిశోధన ఫలితాలు బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ అధ్యయనానికి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం హైదరాబాదు సమీపంలోని పండ్లు, కూరగాయల పంటల సాగు భూముల్లో ఈ మైక్రోబియల్ పద్ధతిని అమలు చేసేందుకు ఫీల్డ్ ట్రయల్స్ ప్లాన్ చేస్తున్నారు. రైతులతో కలిసి వ్యవసాయ భద్రత, పంట నాణ్యతపై విశ్లేషణ చేయనున్నారు.

రసాయనాల ఆధారిత మట్టి శుద్ధికంటే తక్కువ ఖర్చులో చేపట్టే సహజ పద్దతి ఇది. రసాయనాల అవసరం లేకుండా చిన్న రైతులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ పరిష్కారాన్ని తీసుకురావడంపై పరిశోధక బృందం కృషి చేస్తోంది. దీర్ఘకాలికంగా భారత వ్యవసాయాన్ని మట్టి విషపూరితత నుంచి విముక్తి చేయడంలో ఇది సహాయపడుతుందని నమ్మకంగా చెప్పారు.

ఇప్పటికే పరిశోధక బృందం పేటెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. తయారీ, పంపిణీ విషయంలో భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇది ఓ విద్యా ప్రాజెక్టు నుండి భారత వ్యవసాయ రంగంలో కీలక పరిష్కారంగా మారే అవకాశం ఉంది.