చేపల గురించి కోతలు కాదు.. విద్యార్థుల వెతల తీర్చండి
- ఫీ‘జులుం’పై సభలోనే బైఠాయించిన ప్రతిపక్ష సభ్యులు
- రీయింబర్స్ మెంట్ చెల్లించేవరకు కదిలేది లేదన్న విపక్షాలు
బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఊదరగొడుతున్న సీఎం కేసీఆర్... సభలో చేపల పెంపకం గురించి, కోతుల కష్టాల గురించి గంటలు గంటలు మాట్లాడుతారని, అదే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విద్యార్థుల సమస్యల గురించి మాత్రం మాట్లాడరని విపక్షాలు ఎద్దెవా చేశాయి.
ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల కష్టాలను సభ ముందుకు తెస్తే కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ అంశం పై చర్చ జరుగుతుంటే విపక్షాలను మాట్లాడనీయకుండా సీఎం అసెంబ్లీ నుంచి పారిపోయారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే ఫీజు రియింబరస్ మెంట్ చెల్లించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. సభ వాయదా పడిన అనంతరం దీనిపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ సభ్యులందరూ కలసి అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన తెలిపారు.
రియింబర్స్ మెంట్ చెల్లించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేతధోరిణి సరికాదన్నారు.
ఫీజు బకాయిల పై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందోని విమర్శించారు. ఫీజు బకాయిలుకు సంబంధించి రూ. 984 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటే... 1400 కోట్లు విడుదల చేసినట్లు సీఎం సభలో తప్పుడు లెక్కలు చెబుతన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో 37 శాతం కాలేజీలను ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నుండి ప్రభుత్వం కుట్ర పూరితంగా తొలగించిందన్నారు.