ధర్నాచౌక్ లో తిరుగుబాటు జండా ఎగిరింది
ప్రభుత్వం చేపట్టిన ధర్నాచౌక్ తరలింపునకు వ్యతిరేకంగా జరిగిన ‘అక్యుపై ధర్నా చౌక్ ’ విజయవంతమయింది. మొదట ఉద్రిక్తత, వాదులాట, పోట్లాట, లాఠీ చార్జ్ లతో ధర్నాచౌక్ రణరంగాన్ని తలపించినా, తర్వాత సీన్ మారిపోయింది. ప్రభుత్వ మద్దతుదారులు,మఫ్టీ పోలీసు ‘ఉద్యమ’కారులు, పోలీసులు అంతా చప్పుడు చేయకుండా ధర్నాచౌక్ ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.11 గంటలకల్లా ప్రజల చేతుల్లోకి ధర్నా చౌక్ వచ్చేసింది.
సొంత రాష్ట్రం ఒచ్చినంక తెలంగాణ బిడ్డల తొలి అసెంబ్లీ నిన్నటి ధర్నాచౌక్ ముట్టడి. ఉదయం 11 గంటలకల్లా పోలీసుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి ధర్నా చౌక్ వచ్చేసింది. నిజం!
* 10 గంటలకు బస్ భవన్ నుంచి షురువైన అఖిల పక్ష ర్యాలీ అరగంటలో ధర్నా చౌక్ చేరింది.
* ప్రభుత్వమే టెంట్లు వేసి, కుర్చీలు వేసి, తెరాస ముషీరాబాద్ ఇంచార్జి ముఠా గోపాల్ నేతృత్వంలో రౌడీల్ని, గూండాల్ని, పోలీసుల్ని కూడా 'ధర్నా చౌక్ వద్దు' అనే దీక్షలో కూచోబెట్టిండు. ఫోటోలల్ల సూడోచ్చు.
* ప్రభుత్వ వాహనాల్లో బిర్యానీ పొట్లాలు కూడా రెడీ పెట్టుకున్నరు ప్రభుత్వ ఉద్యమ'కారు'ల కోసం.
* ఉధృతంగా వొచ్చిన ప్రజా సంఘాలను లోపలి రానీయకుండ బారికేడ్లు పెట్టి... పర్మిషన్ ఇచ్చి కూడా లోపలి రానియ్యలే.
* రాక్షసంగా ప్రవర్తించిన పోలీసుల చేతిలో నాయకులు, కార్యకర్తలు గాయపడడంతో, ఆగ్రహావేశాలతో జనం కుర్చీలు, జెండా కర్రలు పోలీసుల మీదికి విసిరి, రోడ్లపై బైటాయించి, బారికేడ్లను దూకితే... ఆ ఉధృతిని పోలీసులు ఆపలేక పోయిన్రు.
* ఇసుక వేస్తే రాలని జనాన్ని చూసి తెరాస గూండాల రూపంలోని 'వాకర్స్'... రన్నింగ్ చేస్తూ పారిపోయిన్రు.
* ప్రభుత్వ టెంటును, ప్రభుత్వ కుర్చీలను, ప్రభుత్వ వేదికను, పోలీసులు చేతులు ఎత్తేసి, కళ్ళుఅప్పగించి చూస్తూండగా... ఆక్యుపై చేసేసుకున్నాం!
* కోదండరాం, గాదె ఇన్నయ్య, చాడ వెంకట రెడ్డి, తమ్మినేని వీరభద్రం, పీఎల్ విశ్వేశ్వర రావు సహా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నాయకులంతా ప్రజా స్ఫూర్తికి జేజేలు పలికిన్రు.
ఇదిరా తెలంగాణ. ఇదిరా పోరుబాట. ఇదిరా ప్రజాగ్రహం. ఇదిరా విప్లవం!
కేసీఆర్ కు నిద్రపట్టని కాళరాత్రి నిన్న. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయిన తెలంగాణ ద్రోహి, వారి భజన బృందం ఏం చెప్పినా, ఏ గారడీ చేసినా, లాఠీలు ఝళిపించినా, మీడియాను కొనేసినా... ఏవీ నడవవు అని తేలిపోయింది.
'ప్రజా తెలంగాణ' గత రెండేళ్లుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. అన్యాయానికి, మోసానికి గురైన ఉద్యమకారులు, కళాకారులు; నిలువ నీడ కోల్పోతున్న రైతులు, అగమ్యగోచరంగా ఉన్న సింగరేణి బతుకులు, నిరాశలో ఉన్న యువత... అందరి పక్షాన నిలుస్తూ ఉన్నది. వారితో కదం కదం కలిపి నడుస్తూ ఉన్నది.
ధర్నాచౌక్ స్వాధీనం ప్రజా విజయపు మరో మైలురాయి. దుర్మార్గమైన భూ దోపిడీకి హైకోర్టులో దెబ్బలు, మంథని మధుకర్ రీ పోస్ట్ మార్టం, యువత ముందు కనీసం మాట్లాడలేక పారిపోయిన ముఖ్యమంత్రి, వరంగల్ సభలో అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్న పోటుగాడు... ఇవన్నీ ప్రజల విజయ పరంపరలే.
మరో మజిలీ ఈ ధిక్కారం. ధర్నా చౌక్ ఆక్రమణ.
సమస్త తెలంగాణ బిడ్డలకు మరోసారి సలాం. మరోసారి విజ్ఞప్తి. కేసీఆర్ ఓడిపోతున్నడు. పతనం మొదలైంది.
మనందరి ముందు ఆయనను గద్దె దించే మహత్తర యజ్ఞమున్నది. కదలండి. కలవండి.
ఆవాజ్ దో - హమ్ ఏక్ హై !
(*రచయిత ‘ప్రజాతెలంగాణా’ నాయకుడు