Operation Sindoor పై సీఎం రేవంత్ క్విక్ రియాక్షన్ ... హైదరాబాద్ లో ఎమర్జెన్సీ మీటింగ్

Synopsis
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన దాడులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు హైదరాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసారు.
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అమాయక టూరిస్ట్ లను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు, వారికి సహకరించిన పాకిస్థాన్ పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పాక్ పై అనేక ఆంక్షలు విధించిన భారత్ తాజాగా ఆ దేశ భూభాగంలోకి చొరబడి సైనిక చర్యకు దిగింది. 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్, పివోకే లోని ఉగ్రస్థావరాలపై భారత యుద్ద విమానాలు ఆకస్మిక దాడి చేసాయి. ఈ దాడిలో వందమంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ సింధూర్ పై భారత్ లోని రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దేశ ప్రజలంతా ఈ సమయంలో ఐక్యతను ప్రదర్శిస్తూ ఆర్మీకి మద్దతుగా నిలవాలని సూచిస్తున్నారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆపరేషన్ సింధూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
''భారత పౌరులుగా సాయుధ దళాలకు మద్దతుగా నిలుద్దాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన దాడులు మనందరం గర్వపడేలా చేసాయి. దేశ ఐక్యతను చాటిచెబుతూ ఈ సమయంలో భారత ఆర్మీకి సంఘీభావం తెలియజేద్దాం. మనందరం ఒకే గొంతుకతో 'జైహింద్' అంటూ నినదిద్దాం'' అని సీఎం రేవంత్ ఎక్స్ వేదికన ట్వీట్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ఎమర్జెన్సీ మీటింగ్ :
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని అన్నిరాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నాయి. ఇలా తెలంగాణ కూడా భద్రతా చర్యలు చేపట్టింది... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ అవుతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. భయాందోళనకు గురవుతున్న రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదిపై అధికారులతో సమాలోచనలు జరపనున్నారు.