పేపర్ లీక్ ప్రకంపనలు.. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎన్ఎస్యూఐ కార్యకర్తల యత్నం, ఉద్రిక్తత
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు యత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గాంధీ భవన్ వద్ద ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దీక్షకు దిగారు. ఈ క్రమంలో కమీషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎన్ఎస్యూఐ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
అంతకుముందు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఈటల రాజేందర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రం లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ తో గన్ పార్క్ వద్ద శుక్రవారం బండి సంజయ్ దీక్షకు దిగారు. దీక్ష పూర్తైన తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఎలా జరగిందో టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషనర్ ను కనుక్కొంటానని బండి సంజయ్ ప్రకటించారు. దీనిలో భాగంగా గన్ పార్క్ నుండి టీఎస్పీఎస్సీ వైపుకు బండి సంజయ్ బయలుదేరారు. వాహనాలు మారి టీఎస్పీఎస్సీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు.
Also Read: టీఎస్పీఎస్సీ వైపు వెళ్తున్న బండి సంజయ్ అరెస్ట్: సొమ్మసిల్లిన బీజేపీ కార్యకర్త
అయితే బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఓ బీజేపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనలను నిరసిస్తూ అసెంబ్లీ ముందు బీజేపీ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో గన్పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గన్ పార్క్ వద్ద ఉన్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.