స్కైవేల నిర్మాణానికి 4 ఏళ్లుగా కేంద్రం నుండి అనుమతి రాలేదు: కేటీఆర్
స్కై వేల నిర్మాణం కోసం కేంద్రం నాలుగేళ్లుగా అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్:స్కై వేల నిర్మాణం కోసం కేంద్రం నాలుగేళ్లుగా అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను అండర్ పాసులు, ఫ్లైఓవర్లు నిర్మించినట్టుగా ఆయన చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి కోట్లతో అభివృద్ది పనులు చేశామన్నారు.
also read:3 ఏళ్లలోనే రూ.387కోట్లతో నిర్మాణం: బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా నగరాభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. బాలానగర్ ఫ్లైఓవర్ కు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వినతికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.ఈ బ్రిడ్జి నిర్మాణంలో రెండేళ్లుగా కార్మికురాలుగా పనిచేసిన శివమ్మ చేత ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోడం తనకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. నగరంలో పలు చోట్ల అవసరమైన చోట స్కైవేలు నిర్మిస్తామన్నారు. ఈ విషయమై కేంద్రానికి అనుమతి కోసం కోరినా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన చెప్పారు..