సీఎం కేసీఆర్ తన రెండున్నరేళ్ల పాలనలో ఒకే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చారు.

సీఎం కేసీఆర్ తన రెండున్నరేళ్ల పాలనలో ఒకే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చారు. అది కూడా మేనిఫెస్టోలో పెట్టకుండానే... ఏ మాత్రం ప్రచార ఆర్భాటం లేకుండానే విజయవంతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ఇంతకీ ఏంటా హామీ అనుకుంటున్నారా...

ధర్నా చౌక్ ను ఎత్తివేయడం.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ధర్నాచౌక్‌లో ధర్నాలు ఉండవని, అసలు ధర్నాచౌక్‌తో పనే ఉండదని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ పని చేసి మాట నిలబెట్టుకున్నారు. ధర్నా చౌక్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు నుంచి ధర్నా చౌక్ లో ధర్నాలకు అనుమతి ఇవ్వడాన్ని నిషేధిస్తూ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిర్ణయంతో ఇక హక్కుల పోరాటాలకు, రణనినాదాలకు నిలయంగా మారిన హైదరాబాద్ లోని ఆ ప్రాంతం ఇప్పుడు శాశ్వతంగా మూగబోయింది. ఏ కష్టమోచ్చినా అక్కడే నినదించి తమ బాధను ప్రపంచానికి వినిపించే ఆ వేదిక ఇక కనుమరగైంది.

టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీలు ధర్నాచౌక్ వేదికగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో హైదరాబాద్ లో ధర్నాలు చేయడం ఇక కష్టంగా మారనుంది.

ఇక పై ధర్నాలు చేయాలంటే వరంగల్‌ జాతీయ రహదారిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని పర్వతపురం, కాప్రా సమీపంలోని జవ హర్‌నగర్‌, శంషాబాద్‌, గండిమైసమ్మ తదితర రహదారుల్లో ప్రభుత్వం సూచించిన ప్రాంతంలో మాత్రమే ధర్నాలు చేయాలి.

కాగా, సచివాలయం, అసెంబ్లీకి సమీపంలో ధర్నాచౌక్‌ ఉండడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని అందుకే ధర్నా చౌక్ ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

అయితే ప్రభుత్వ చర్యపై ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ధర్నా చౌక్ ను ఎత్తి వేస్తే అసెంబ్లీ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి.