సికింద్రాబాద్ బోనాలు: బంగారు బోనం సమర్పించిన కవిత (వీడియో)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ ఎంపీ కవిత ఆదయ్యనగర్లో బంగారు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి బయలుదేరారు. కవితతో పాటు మహిళలు 1008 బోనాలు ఎత్తుకుని వచ్చారు. ఆదయ్యనగర్, సిటీలైట్హోటల్, ఆర్మీరోడ్డు, సుభాష్రోడ్డు మీదుగా బంగారు బోనం ఊరేగింపుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొంది.
అమ్మవారికి కవిత బోనం సమర్పించారు. బంగారు బోనం వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
అమ్మవారికి నిజామాబాద్ ఎంపీ కవిత మూడు కేజీల 80 గ్రాముల బంగారంతో ఈ బంగారు బోనాన్ని తయారు చేయించారు. రెండు బంగారు పాత్రలు, ప్రమిదను బంగారు బోనం కోసం తయారు చేయించారు. ఈ పాత్రలపై 285 వజ్రాలను అలంకరించారు. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ అమ్మవారిని దర్శించుకొంటారు.
"