NHRC issues notice to Telangana : హైదరాబాద్ చోటుచేసుకున్న ప‌రువు హత్యపై తెలంగాణకు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కులాంతర లేదా మతాంతర వివాహాల కేసుల్లో పరువు హత్యలు జరగకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా విధానం ఉందా లేదా అనే నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది.  

Hyderabad honour killing : హైదరాబాద్‌లో అనుమానాస్పద పరువు హత్యలో 25 ఏండ్ల యువకుడిని అతని భార్య సోదరుడు మరియు మరొక వ్యక్తి హత్య చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) శుక్రవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. కులాంతర లేదా మతాంతర వివాహాల కేసుల్లో పరువు హత్యలు జరగకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా విధానం ఉందా లేదా అనే నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. ఈ కేసులో ప్రస్తుత దర్యాప్తు ప‌రిస్థితి, బాధితుడి భార్య మరియు అతని కుటుంబ సభ్యులను రక్షించడానికి తీసుకున్న చర్యలు, వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైనా సహాయం గురించి తెలియజేయాలని DGPని కోరింది.

"ఈ కేసులో పోలీసు అధికారుల తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా కమిషన్ తెలుసుకోవాలని కోరుతోంది" అని NHRC ఒక ప్రకటనలో పేర్కొంది. “అమ్మాయి సోదరుడు ఆమె మతాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాడని మరియు దానికి వ్యతిరేకంగా హెచ్చరించాడని పోలీసులు నివేదించారు. వార్తా నివేదికలో పేర్కొన్నట్లుగా, ఈ జంట పాఠశాల మరియు కళాశాలలో సహవిద్యార్థులు మరియు 5 సంవత్సరాలకు పైగా ప్రేమలో ఉన్నారు, అయినప్పటికీ అమ్మాయి కుటుంబం సంబంధాన్ని వ్యతిరేకించింది”అని పేర్కొంది. కాగా, హైద‌రాబాద్ లో చోటుచేసుకున్న ఈ ప‌రువు హ‌త్య ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. పరువు హ‌త్య‌ల‌పై మ‌రోసారి తీవ్ర‌మైన చ‌ర్చ‌ను లేవ‌దీసింది. 

ఇదిలావుండ‌గా, స‌రూర్ న‌గ‌ర్ పరువు హత్యపై తెలంగాణ గవర్నర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. ఈ నెల 4వ తేదీన రాత్రి సరూర్ నగర్ మున్సిపాలిటీ వద్ద నాగారాజును అతని భార్య సోదరులు హత్య చేశారు. మతాంతర వివాహం చేసుకొన్నందుకు కక్షగట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నాగరాజు భార్య ఆశ్రీన్ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు న‌మోదుచేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిపై చ‌ట్ట‌ప‌రంగా కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం నుంచి నివేదిక కోరారు. 

కాగా, గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య దూరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు. తమిళిసై చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. సీఎం KCR తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan చెప్పారు.ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమె న్యూఢిల్లీ లో ఆమె ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. తాను ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.