పేపర్ లీకేజ్ బీజేపీ కుట్రే, నిందితుడు రాజశేఖర్ ఆ పార్టీ కార్యకర్తే.. ఫోటోలు విడుదల చేసిన కేటీఆర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని ఫోటోలు విడుదల చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేసినట్లుగా అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇందులో రాజకీయ కోణాలు వున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని ఫోటోలు విడుదల చేశారు మంత్రి కేటీఆర్. స్కాం వెనుక వున్న సూత్రధారులను కనిపెట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కేటీఆర్ డీజీపీని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేసినట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమాయకుల జీవితాలను నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు.
మరోవైపు.. పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 పోస్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. మార్చి 5న దాదాపు 55 వేల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
ALso REad : పేపర్ లీకేజ్.. టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం, అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు
ఇకపోతే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్గా వ్యవహరిస్తున్నారు రేణుక. ఏడాది 12 సెలవులు పెట్టింది రేణుక. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని సెలవు పెట్టింది. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు పెడుతోంది రేణుక.
పేపర్ లీక్కు సూత్రధారిగా రాజశేఖర్ను తేల్చారు పోలీసులు. ప్రవీణ్ ద్వారా పేపర్ను బయటికి తెప్పించాడు రాజశేఖర్. టీఎస్పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్పై వచ్చాడు రాజశేఖర్. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ను బయటకు తెచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పాడు ప్రవీణ్.