దేశంలో మూడో అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్
Hyderabad: దేశంలో అత్యంత సురక్షితమైన మూడో నగరంగా హైదరాబాద్ నిలిచింది. జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్న భాగ్యనగరం.. దక్షిణ భారతంలో మొదటి స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదికలు పేర్కొన్నాయి.
NCRB report: దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో సురక్షిత నగరంగా నిలిచింది. సురక్షితమైన నగరాల జాబితాలో కోల్కతా, పూణే వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్న భాగ్యనగరం.. దక్షిణ భారతంలో మొదటి స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదికలు పేర్కొన్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం.. 2021లో హైదరాబాద్లో ప్రతి మిలియన్ జనాభాకు 2599 నేరాలు మాత్రమే జరుగగా, దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మిలియన్ జనాభాకు 18596 నేరాలు జరిగాయి. ఈ జాబితాలో టాప్ లో ఉన్న కోల్కతా, పూణేలలో, ప్రతి మిలియన్ జనాభాకు 2021లో వరుసగా 1034, 2568 నేరాలు జరిగాయని నివేదిక పేర్కొంది. 2021లో కోల్కతాలో 45, హైదరాబాద్లో 98, బెంగళూరులో 152, దేశ రాజధాని ఢిల్లీలో 454, ఆర్థిక రాజధాని ముంబయిలో 162 హత్య కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది కోల్కతాలో 135, హైదరాబాద్లో 192, బెంగళూరులో 371, ఢిల్లీలో 752, ముంబయిలో 349 హత్యాయత్నాలు జరిగాయి. అత్యాచార ఘటనలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా, కోల్కతాలో 11, హైదరాబాద్లో 116, బెంగళూరులో 117, ఢిల్లీలో 1,226, ముంబయిలో 364 కేసులు నమోదయ్యాయని తేలింది.
దేశంలో నేరాలు అధికంగా నమోదవుతున్న నగరాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలోని 19 మహా నగరాల నేరాల సగటు సంఖ్య 8,351గా ఉంది.
నగరాలు - నేరాలు
ఢిల్లీ - 18,596
సూరత్ (గుజరాత్)_ 16,768
కొచ్చి (కేరళ) - 16,022
అహ్మదాబాద్ (గుజరాత్) - 15,190
ఇండోర్ (మధ్యప్రదేశ్) - 11,071
జైపూర్ (రాజస్థాన్) - 10,269
నాగపూర్ (మహారాష్ట్ర) - 8921
పాట్నా (బీహార్) - 8721
ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) - 6989
కోయంబత్తూరు (తమిళనాడు) - 6494
లక్నో (ఉత్తరప్రదేశ్) - 5909
కోజీకోడ్ (కేరళ) - 5158
ముంబయి (మహారాష్ట్ర) - 4285
బెంగళూరు (కర్నాటక) - 4272
కాన్పూర్ (మధ్యప్రదేశ్) - 3365
హైదరాబాద్ (తెలంగాణ) - 2599
పూణే (మహారాష్ట్ర) - 2568
కోల్ కతా (బెంగాల్) - 1034
తెలంగాణ ఆవిర్భావం నాటి అంచనాలు
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అంచనా వేశారు. అలాగే, తెలంగాణ నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రంగా మారుతుందని కొందరు రాజకీయ నాయకులు కూడా జోస్యం చెప్పారు. కానీ ఎనిమిదేళ్లలో దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో రాష్ట్రం ఒకటి అని నిరూపించడమే కాకుండా క్రైమ్ రేట్లను తగ్గించడం ద్వారా పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగింది. దేశంలోని టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ ను దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడంలో మెరుగైన చర్యలు తీసుకుంటున్న పోలీసు శాఖను మంత్రి కేటీఆర్ అభినందించారు.