అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ పడి నవీన్ అనే మిత్రుడిని హరిహరక్రిష్ణ హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. నవీన్ ను హత్య చేసిన తర్వాత గుండెను చీల్చాడు, పొట్టను చీల్చాడు, మర్మాంగాన్ని కోసేశాడు.
హైదరాబాద్: నవీన్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగు చూశాయి. ప్రియురాలి కోసం మిత్రుడు నవీన్ ను హత్య చేసిన హరిహరక్రిష్ణ సైకోలా వ్యవహరించాడు. నవీన్ ను హత్య చేసిన తర్వాత అతను ఒళ్లు గగుర్పొడిచే విధంగా చేశాడు. ఈ నెల 17వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నవీన్, హరిహరక్రిష్ణ గొడవ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే, నవీన్ ను హత్య చేయడానికి పక్కా ప్లాన్ వేసుకున్న హరిహరక్రిష్ణ చేతిలో నవీన్ హతమయ్యాడు. గొంతు నులిమి నవీన్ ను హరిహరక్రిష్ణ హత్య చేశాడు.
ఆ తర్వాత శవాన్ని ఎవరూ గుర్తు పడ్డకూడదనే ఉద్దేశంతో నవీన్ దుస్తులను హరిహరక్రిష్ణ తొలగించాడు. నవీన్ సెల్ ఫోన్ ను ధ్వంసం చేశాడు. నవీన్ తలను, మొండేన్ని వేరు చేశాడు.అంతటితో ఆగకుండా గుండెను చీల్చాడు. పొట్టను కోసి పేగులు బయటకు తీశాడు. నవీన్ మర్మాంగాన్ని కోసేశాడు. ఇదంతా పోలీసు దర్యాప్తులో తేలింది.
నవీన్ ను హత్య చేయాలని పక్కా ప్రణాళిక వేసుకున్న హరిహరక్రిష్ణ రెండు నెలల కింద కత్తి కొన్నాడు.దాన్ని స్కూటీలో పెట్టుకుని తిరుగుతూ వచ్చాడు.ఈ నెల 17వ తేదీన నవీన్ ను తీసుకుని అబ్దుల్లాపూర్ మెట్ వెళ్లాడు. నవీన్ ను చంపేందుకు కత్తిపై వేలిముద్రలు పడకుండా ధరించాడు. హరిహరక్రిష్ణ నవీన్ ను హత్య చేసిన తీరు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. క్రైమ్ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు హరిహరక్రిష్ణ ప్లాన్ చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తన కుమారుడిని హత్య చేసిన తర్వాత మూడు రోజులకు హరిహరక్రిష్ణ ఫోన్ చేసి నవీన్ కనిపించడం లేదని చెప్పాడని హతుడి తండ్రి శంకర్ మీడియాతో చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పిన క్రిష్ణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని ఆయన చెప్పారు.గెట్ టుగెదర్ పేరుతో తన కుమారుడిని పిలిచి హరిహరక్రిష్ణ హత్య చేశాడని ఆయన అన్నారు. నవీన్ ఆ అమ్మాయి ప్రేమలో లేడని ఆయన చెప్పారు.ఈ హత్యలో అమ్మాయి ప్రమేయం ఉందో, లేదో తెలియదని ఆయన అన్నారు.
హరిహరక్రిష్ణ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... నవీన్, హరిహరక్రిష్ణ హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో క్రిష్ణ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఆ తర్వాత అతనికి దూరమైంది. నవీన్ తో సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. దాంతో నవీన్ ను చంపాలని హరిహర క్రిష్ణ ప్లాన్ వేసుకున్నాడు.
నేనావత్ నవీన్ నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందినవాడు. నల్లగొండలోని ఎంజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజులైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో, కళాశాలకు కూడా వెళ్లకపోవడంతో తండ్రి శంకర్ నాయక్ ఈ నెల 22వ తేదీన నార్కెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.