Asianet News TeluguAsianet News Telugu

నర్సంపేటలో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్


నర్సంపేటలో  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్  షర్మిలను  నర్సంపేట పోలీసులు  ఇవాళ  అరెస్ట్  చేశారు.  

Narsampeta  Police  Arrested  YSRTP Chief  YS  Sharmila
Author
First Published Nov 28, 2022, 4:01 PM IST

నర్సంపేట: వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిలను  నర్సంపేట  పోలీసులు  సోమవారంనాడు  అరెస్ట్  చేశారు.  షర్మిలను  అరెస్ట్ చేసేందుకు  పోలీసులు ప్రయత్నించిన  సమయంలో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.షర్మిలను  అరెస్ట్ చేసేందుకు  వచ్చిన  పోలీసులకు ,వైఎస్ఆర్‌టీపీ పోలీసుల  మధ్య  తోపులాట  చోటు  చేసుకుంది.  పోలీసులను నిలువరించేందుకు  వైఎస్ఆర్‌టీపీ  కార్యకర్తలు  ప్రయత్నించారు. ఇరువర్గాల  మధ్య తోపులాట  చోటు  చేసుకుంది.ఈ సమయంలో  ఉద్రిక్తత నెలకొంది.  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్  షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి  సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 

వైఎస్  షర్మిలను తరలించే  పోలీస్  వాహనం  ముందు  వైఎస్ఆర్‌టీపీ  కార్యకర్తలు బైఠాయించి  నిరసనకు దిగారు. సీఎం  కేసీఆర్‌కి  వ్యతిరేకంగా  నినాదాలు  చేశారు.  వైఎస్ఆర్‌టీపీ  కార్యకర్తలను చెదరగొట్టి  పోలీసులు  షర్మిలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసుల తీరును వైఎస్ఆర్‌టీపీ చీఫ్  షర్మిల  తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు. 

ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా  నిన్న  నర్సంపేట ఎమ్మెల్యే  పెద్ది  సుదర్శన్  రెడ్డిపై షర్మిల  తీవ్ర వ్యాఖ్యలు చేశారుఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్  శ్రేణులు  తీవ్ర ఆగ్రహం  వ్యక్తం  చేశాయి. ఈ  వ్యాఖ్యలు  చేసిన  షర్మిల క్షమాపణ  చెప్పాలని డిమాండ్  చేశారు. నర్సంపేట  నియోజకవర్గంలోని  చెన్నరావుపేట  మండలం లింగగిరిలో  షర్మిల  బస  చేసే  బస్సును  టీఆర్ఎస్  శ్రేణులు  ధ్వంసం  చేశాయి.  పెట్రోల్  పోసి ఈ బస్సుకు   నిప్పు పెట్టారు టీఆర్ఎస్  శ్రేణులు.  

ఇవాళ  ఉదయం నుండి నర్సంపేట  నియోజకవర్గంలో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. షర్మిల  పాదయాత్రకు  టీఆర్ఎస్  శ్రేణులు అడ్డంకులు  సృష్టించే ప్రయత్నం  చేశారు.  లింగగిరి  వద్ద  షర్మిలను  పోలీసులు  అరెస్ట్  చేశారు. తాను  బస  చేసే  బస్సులో  ఉన్న  షర్మిలను  పోలీసులు అరెస్ట్  చేశారు.  షర్మిలను  అరెస్ట్  చేసే సమయంలో  అడ్డుకొన్న  వైఎస్ఆర్‌టీపీ  శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు

తమ  బస్సును  దగ్దం చేసిన  టీఆర్ఎస్  శ్రేణులను  అరెస్ట్  చేశారా  అని  షర్మిల  ప్రశ్నించారు.  తప్పులు  చేసిన వారిని వదిలేసి  తనను అరెస్ట్  చేయడంపై  షర్మిల  మండిపడ్డారు. నిన్న జరిగిన  సభలో నర్సంపేట  ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్  రెడ్డిపై షర్మిల  తీవ్ర  విమర్శలు  చేశారు. నర్సంపేట  ఎమ్మెల్యే  సుదర్శన్ రెడ్డి  పెద్ద అవినీతిపరుడని  షర్మిల  ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  సుదర్శన్ రెడ్డి ఆస్తులెన్ని  ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన  తర్వాత  సుదర్శన్ రెడ్డి  ఆస్తులు  ఎలా  పెరిగాయో  చెప్పాలన్నారు.ఈ  ఏడాది డిసెంబర్  12న పాదయాత్రను  ముగించనుంది.  పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని  హన్మకొండలో  వైఎస్ఆర్‌టీపీ  సభను  ఏర్పాటు  చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios