భయంతోనే కేసీఆర్ విమర్శలు: సైకిలెక్కిన నందీశ్వర్ గౌడ్
ఓటమి భయంతోనే మహా కూటమిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పారు
హైదరాబాద్: ఓటమి భయంతోనే మహా కూటమిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పారు. 21 ఏళ్ల కాలంలోనే తాను పటాన్ చెరువు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడానికి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు కారణమన్నారు.
పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ సమక్షంలో టీడీపీలో చేరారు. తాను ఆనాడూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీపీగా బాధ్యతలను చేపట్టినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. తెలంగాణలో టీడీపీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయని చెబుతున్నాడని.. ఒక్క శాతం ఓట్లు ఉన్న టీడీపీని చూసి ఎందుకు భయపడుతున్నారని నందీశ్వర్ గౌడ్ ప్రశ్నించారు.
పటాన్ చెరువులో మహాకూటమి తరపున ఎవరికీ టిక్కెట్టు ఇచ్చినా కూడ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన ప్రకటించారు. లక్షమందితో పటాన్ చెరువులో త్వరలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ బాధితుల సహాయం కోసం తాను వ్యక్తిగతంగా రూ. 5లక్షలను అందించనున్నట్టు నందీశ్వర్ గౌడ్ ప్రకటించారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు
కేఈతో బంధుత్వం నిజమే,.. కానీ అదే కారణం కాదు: నందీశ్వర్ గౌడ్
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్