టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను కోర్ట్ ఈడీ కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైల్లో వీరిద్దరిని ప్రశ్నించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను కోర్ట్ ఈడీ కస్టడీకి అనుమతించింది. వీరిద్దరిని ప్రశ్నించేందుకు అనుమతించింది. చంచల్గూడ జైల్లో వీరిద్దరిని ప్రశ్నించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును ఈడీ విచారిస్తోంది.
ఇదిలావుండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులిద్దరికీ ఆ పేపర్లున్న సిస్టమ్ పాస్ వర్డ్ ఎలా తెలిసిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి పాస్వర్డ్, యూజర్ ఐడి ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఎలా తెలిసాయి అనేది మిస్టరీగా మారింది. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం గత నెల 11వ తేదీన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఈ కేసులో 18 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. వివరాలు ఇవ్వాలని కోరిన ఈడీ.. వ్యతిరేకిస్తూ కోర్టులో సిట్ కౌంటర్..!!
రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ గ్రూప్ వన్ ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించాడు. ప్రస్తుతం ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడు. ఇది గుర్తించిన సిట్ పోలీసులు అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం తనకు అందలేదని వాట్సాప్ ద్వారానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులోనూ, సిట్ కస్టడీలోను నిందితులిద్దరూ యూజర్ ఐడి, పాస్వర్డ్ లను ప్రశ్నాపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసినవే తీసుకున్నట్లుగా ఒకేలాగా చెప్పుకొచ్చారు.
వీరు చెప్పిన సమాచారం ప్రకారం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, అందులో ఎక్కడా కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ రాసినట్లుగా ఆధారాలు లభించలేదు. శంకర లక్ష్మి కూడా ఈడీ అధికారుల విచారణలో, సిట్ పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పారు. మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆ అనుమానితుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.
