బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను కలచివేసిందని, ఆయన రాజీనామాకు నిరసనగా నల్లగొండ పట్టణ శాఖ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు రాజీనామా చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డిని నియమించింది. బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం ఈ విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం, రాజీనామా పత్రాన్ని బండి సంజయ్ అందించినట్టు సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ బీజేపీ దూకుడుగా ఆదరణ పొందడానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఢీకొట్టే సత్తా కేవలం బీజేపీకే ఉన్నదని ఆ మధ్య ఒక జోష్‌ను తీసుకురావడంలో బండి సంజయ్ పాత్ర కీలకంగా ఉన్నది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించరాదని తెలంగాణ బీజేపీలోని పలువురు నేతలు అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. ఆయనను తొలగిస్తే పార్టీ ఢీలా పడిపోతుందనీ హెచ్చరించారు. అధ్యక్ష మార్పేమీ ఉండదని చెబుతూనే తాజాగా ఆ నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్ తీసుకుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పార్టీలోని పలువురు నేతలను కలవరపరిచింది. ఈ క్రమంలోనే నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేస్తూ తాను బండి సంజయ్‌కు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Also Read: తెలంగాణ బీజేపీకి మరో షాక్.. అధ్యక్ష బాధ్యతలకు కిషన్ రెడ్డి విముఖత? పదవిపై మాట్లాడటానికి నిరాకరణ

తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్ తన కుటుంబాన్ని, ప్రాణాన్నీ లెక్క చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లారని, అధికారపార్టీకి ఒక బలమైన ప్రత్యర్థ పార్టీగా బీజేపీని నిలిపారని నాగేశ్వర్ రావు ఆ లేఖలో తెలిపారు. కొందరు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వినా, తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించినా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్లాడని, పార్టీ కార్యకర్తల్లోనూ ధైర్యాన్ని నింపాడని పేర్కొన్నారు. అలాంటి నాయకుడు రాజీనామా చేయడం తనను కలచివేసిందని, అందుకు నిరసనగా తానూ రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.