దయచేసి సస్పెండ్ చేయండి, లేదంటే.. : డీఎస్
తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తాను పార్టీకి రాజీనామా చేయబోనని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్: తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తాను పార్టీకి రాజీనామా చేయబోనని ఆయన ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఏం చేశానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు ఆయన నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన మంగళవారం నాడు మీడియాకు విడుదల చేశారు. తాను పార్టీ వదిలివెళ్తే తనపై చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నట్టుగానే తేలుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిత్వం అందరికీ తెలుసునని చెప్పారు.
స్వతంత్రంగా ఎదిగిన తన ఇద్దరు కొడుకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తన కొడుకుల నిర్ణయాల విషయంలో తానేమీ చేయలేనని ఆయన చెప్పారు.
మనసులో ఏదో పెట్టుకొని తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు చేసిన ఆరోపణలు తనకు బాధ కల్గించినట్టు ఆయన చెప్పారు. నా కొడుకు అరవింద్ బీజేపీలో చేరుతాడని కేసీఆర్ కు ముందే చెప్పినట్టు ఆ లేఖలో డీఎస్ చెప్పాడు.తన కొడుకు సంజయ్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ అత్యూత్సాహన్ని ప్రదర్శించిందని ఆయన చెప్పారు.
తాను పార్టీలో ఉండడం ఎంపీ కవితకు, జిల్లా పార్టీ నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వాదించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించినట్టు ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ కోసం సమైక్యవాదులకు వ్యతిరేకంగా పోటం చేసినట్టు చెప్పారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదని తాను చెప్పానన్నారు. తన అనుచరులను బీజేపీలో చేరాలని తాను ఏనాడూ చెప్పలేదని డీఎస్ చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ తనపై కక్ష కట్టిందని డీఎస్ ఆరోపించారు.
ఈ వార్తలు చదవండి
కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు
కేసీఆర్తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ