‘లోకేష్ చిన్నవాడని వదిలేస్తున్నా, టీడీపీ నాది.. నేను వెళ్లను’
మీడియాతో మోత్కుపల్లి
తాను టీడీపీ వదిలివెళ్లనని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సమసమాజ స్థాపన, పేదవారి అభ్యున్నతి కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, పెత్తందార్ల కోసం కాదని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు గుంజుకున్నారని ఆరోపించారు. తాను చంద్రబాబును నమ్మి మోసపోయానన్నారు.
ఎన్టీఆర్పై కుట్ర పన్నినట్టే కేసీఆర్పై కూడా చంద్రబాబు కుట్ర చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారని అన్నారు. అయితే కేసీఆర్ తెలివిగలవారు కావడంతో వాళ్లను పట్టుకోగలిగారని పేర్కొన్నారు. కేసీఆర్ రాజ్యసభ సీట్లను పేదలకు ఇస్తే.. చంద్రబాబు వందకోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ను తరతరాలు గుర్తించుకునేలా ఆ యన కోసం ఒక స్తూపాన్ని నిర్మించాలని కోరారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని గుర్తు చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ నాది. రాజీనామా చేయను. పార్టీని వీడాల్సిన అవసరం నాకు లేదు’’అని స్పష్టం చేశారు.
పట్టపగలు ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి రేవంత్రెడ్డి.. ఓ నీచుడని విమర్శించారు. ఆ కేసు వల్లే కేసీఆర్కు చంద్రబాబు లొంగిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతోపాటు ఏపీలోని అన్ని కులాల మధ్యా చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. బాబు రాజకీయ అనుభవం ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పనిచేయలేదా?అని ప్రశ్నించారు. ఆయనకు పౌరుషం ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. లోకేశ్ వయసులో చిన్నవాడనే ఉద్దేశంతోనే ఆయన గురించి మాట్లాడకుండా వదిలేస్తున్నానని చెప్పారు