రైతులకు చల్లటి కబురు... తెలంగాణకు రెండురోజుల ముందే రుతుపవనాలు
రుతుపవనాల రాకతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా ఇవాళ(ఆదివారం) మరిన్ని జిల్లాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే తెలంగాణకు చేరినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అందువల్లే పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా ఇవాళ(ఆదివారం) మరిన్ని జిల్లాలకు రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే వచ్చాయని తెలిపారు.
రుతుపవనాల ప్రవేశంతో రాజధాని హైదరాబాద్ లో రాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలయిన మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసాయి. సిద్దిపేట, సిరిసిల్ల కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో నిన్నటి నుండి వర్షాలు కురుస్తున్నాయి.
ఇక రానున్న మూడురోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.