సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రజాకార్ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమానికి రాజాసింగ్ అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బంతిని కిందకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుందని.. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నట్లుగా రాజాసింగ్ పేర్కొన్నారు. 

చంద్రబాబు నాయుడు అంటే సీఎం జగన్ భయపడుతున్నారని రాజా సింగ్ విమర్శించారు. అందుకే కేసులో సంబంధం లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇది జగన్‌కు మైనస్.. చంద్రబాబుకు ప్లస్ అవుతుందని అన్నారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారని కామెంట్ చేశారు. 2024లో ఏపీలో తెదేపా ప్రభుత్వం ఏర్పడుతుందని  ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలకు సేవ చేసిన పేరు ఉందన్నారు. ఆయనపై పెట్టిన కేసును కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.