తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెబుతూ.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్ఢ్ పోటీల ద్వారా ప్రపంచ దేశాలకు చూపించాలని, తద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని అన్ని ముఖ్యపర్యాటక ప్రాంతాలు ప్రమోట్ చేసేలా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్లోని వేయిస్తంభాల గుడి, రామప్పదేవాలయం, గిరిజన ప్రాంతాలు, వీటితోపాటు హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు గోల్కోండ్, చార్మినార్ వంటి కట్టడాల నేపథ్యం వివరించి దేశంలోపాటు, ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబు కానుంది. మే మొదటి వారం నుంచి నెలాఖరు వరకు పోటీలు నిర్వహించనున్నారు. ఇక హైటెక్స్ సిటీలో ప్రధాన పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం జీహెచ్ఎంసీ రూ.1.70 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. హైటెక్ సిటీతోపాటు, చార్మినార్, ట్యాంక్బండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో థీమాటిక్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, ఎల్ఈడీ విద్యుద్దీపాలతో ప్రపంచ సుందరి కిరీటం నమూనాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆ పనులును రెండు మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేశారు. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.