హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 నిర్వహణలో భాగంగా 10 ప్రాంతాల్లో డ్రోన్ల నిషేధం అమల్లోకి వచ్చింది. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

హైదరాబాద్ అంతర్జాతీయ రంగంలో మరో ఘనమైన ఈవెంట్‌కు వేదిక కానుంది. మే 10 నుంచి 31వ తేదీ వరకు జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 కాంటెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వేడుకలో దేశ విదేశాల నుంచి ప్రముఖ అతిథులు, పాల్గొనబోయే సుందరాంగులు హైదరాబాద్‌కి రాబోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నగర పోలీసులు ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముఖ్యంగా, మిస్ వరల్డ్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకొని డ్రోన్లపై నిషేధం విధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వుల ప్రకారం, మే 13న చార్మినార్, లాద్‌బజార్, చౌమహల్లా ప్యాలెస్, ఖిల్వత్, శాలిబండ పరిసరాల్లో డ్రోన్ల ఎగురవేతపై పూర్తిగా నిషేధం ఉంటుంది. అలాగే, మే 18న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC), తెలంగాణ సచివాలయం, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ నిషేధం అమల్లోకి వస్తుంది. జూన్ 2న రాజ్‌భవన్, సోమాజిగూడ రోడ్ వద్ద డ్రోన్లపై ఆంక్షలు ఉంటాయి. ఈ నిషేధం భారతీయ నాగరిక భద్రత సంహిత 2023 లోని సెక్షన్ 163 ప్రకారం అమలవుతోంది. నిషేధం కింద, ఆ ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎగరడానికి అనుమతి లేదు.

డ్రోన్ల నిషేధం..

ఇక మరోవైపు, మిస్ వరల్డ్ 2025కి వచ్చే విదేశీ అతిథుల కోసం నగరంలోని హోటళ్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మే 5న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ పోలీసు శాఖను పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా, గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాద్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయం వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశం హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి భద్రతా చర్యలపై సీఎం సమీక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీకి హైదరాబాద్ ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తోంది.ఈ నేపథ్యంలో నగర ప్రజలు కూడా డ్రోన్ నిషేధాన్ని గౌరవించి, పోలీసు మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. మిస్ వరల్డ్ 2025 వల్ల హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కబోతుండగా, ఈవెంట్ విజయవంతంగా జరగాలంటే ప్రతిఒక్కరి సహకారమూ అవసరమే.