వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన.. ఉద్రిక్తతంగా పరిస్థితులు..
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో (Warangal Enumamula Market) మిర్చి రైతుల ఆందోళనకు (Mirchi Farmers Protest ) దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో (Warangal Enumamula Market) మిర్చి రైతుల ఆందోళనకు (Mirchi Farmers Protest ) దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తేజ రకం మిర్చికి క్వింటాలుకు 17,200 రూపాయల ధర నిర్ణయించినప్పటికీ.. దళారులు 14 వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. దళారుల దందా అరికట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ధర నిర్ణయంపై వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి ధర పరిశీలించాలని అధికారులు పేర్కొన్నారు. ధరలు సవరించాలని వ్యాపారులను అధికారులు ఆదేశించారు. ఎనుమాముల మార్కెట్ ఛైర్మన్ చెప్పినప్పటికీ రైతులు, వ్యాపారులు వినట్లేదు. నిర్ణయించిన ధరకు రూ.2 వేలు అదనంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో రైతులు అక్కడే ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే అధికారులు కాంటాలు నిర్వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల్లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఎనుమాముల మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. మార్కెట్ కార్యాలయంపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాంటాల నిర్వహణను అడ్డుకున్న రైతులు.. అప్పటికే లోడ్ చేసిన బస్తాలను వాహనాల నుంచి దించేశారు. రైతుల దాడి చేయడంతో అక్కడ ఓ డీసీఎం వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.